సైకిల్ ఏమి “అక్షయ పాత్ర” కాదుగా..?

TDP Party

ఇంచార్జ్ ల మార్పు తో జగన్ మోహన్ రెడ్డి పై అలకపూనిన వారు, తాము ఆశించిన స్థానంలో సీటు దక్కని వారు, వైసీపీ ఫ్యాను గాలి తట్టుకోలేని వారు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వీడి తెలుగు దేశం సైకిలు ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

40 ఏళ్ళ నుంచి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్న టీడీపీ పార్టీలో నాయకులకు, నేతలకు, కార్యకర్తలకు కొదవు లేదనేది గమనించాల్సిన వాస్తవం. అయితే ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కారణంగా కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు త్యాగాలకు సైతం సిద్దపడాల్సి ఉంటుంది. అలాగే జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈ కూటమిలో చేరితే మరికొన్ని స్థానాలను టీడీపీ త్యాగం చేయక తప్పని పరిస్థితి. ఆ త్యాగాలకు సిద్ధపడిన నాయకులను సైకిల్ దిగకుండా, పార్టీ కండువా మార్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధిష్టానంకు పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ADVERTISEMENT

ఇటువంటి సమయంలో టీడీపీ పార్టీ వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి పెద్ద పీట వేసినట్లయితే అటు మిత్ర పక్షంగా ఉన్న జనసేన పార్టీ కోసం కొన్ని, ఇటు విపక్ష పార్టీ అసమ్మతి నేతల కోసం మరి కొన్ని త్యాగాలు చేయడానికి టీడీపీ నాయకులు సుముఖత చూపుతారా..? దాని వలన టీడీపీ అధిష్టానం సొంత పార్టీలో అసమ్మతిని దగ్గరుండి ప్రోత్సహించిన వారవుతారు. టీడీపీ సైకిల్ ఏమి “అక్షయ పాత్ర” కాదుకదా..!ఎంతమందిని ఎక్కించిన మరొకరికి స్తానం మిగిలి ఉండడానికి.

ఇటువంటి అవకాశాలను అధికార పార్టీ వైసీపీ అందిపుచ్చుకుని తిరిగి టీడీపీని దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తుంది.జనసేన పొత్తుతో ఇప్పటికే తలకు మించిన భారంగా మారిన టీడీపీ నాయకుల సంఖ్యను ఇప్పుడు వైసీపీ అసమ్మతులతో పాతాళానికి పడేస్తారా..?అంటూ టీడీపీ శ్రేణులు అధిష్టానాన్ని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. తాజాగా బెజవాడ ఈస్ట్ నుంచి గద్దెరామ్మోహన్ రావు కు ప్రత్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వైసీపీ నాయకుడు బొప్పన భవకుమార్ సైకిల్ ఎక్కడానికి లోకేష్ తో మంతనాలు మొదలుపెట్టారు.

మరోపక్క విశాఖ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. తనతో పాటుగా 12 మంది కార్పొరేటర్లను కూడా వైసీపీ నుండి టీడీపీ సైకిల్ ఎక్కించడానికి రెడీ అయ్యారు సీతంరాజు. అలాగే విజయవాడ పెనమలూరు టీడీపీ సీటు కూడా వైసీపీ అసమ్మతి నేత పార్థ సారధి పట్టుబట్టడంతో ఇటు సొంత పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది.

వైసీపీ తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే వేధింపులను, ఇబ్బందులను తట్టుకుని అధికార పార్టీ పై అలుపెరుగని పోరాటం చేస్తున్న సొంత పార్టీ నాయకులను కాదని పక్క ఆపార్టీ అసమ్మతులను సైకిల్ ఎక్కించుకుంటే చివరకు నష్టపోయేది ఎవరో ఒక్కసారి టీడీపీ పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలి.

కేవలం గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్ అంటూ జగన్ తన పార్టీ నాయకుల పై దయాదాక్షిణ్యం లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంటే అక్కడ గెలిచే అవకాశం లేని నాయకులను తీసుకువచ్చి ఆ వ్యతిరేకతను టీడీపీ పార్టీ తన భుజాన మోయడం అవివేకమే అవుతుంది. మోయలేని భారం సైకిల్ మీద వేసి బలవంతంగా మోయాల్సిందే అంటే ఆ సైకిల్ పరిస్థితి ఏమిటి అనేది కూడా టీడీపీ అధిష్ఠానము ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories