గడిచిన మూడేళ్ళలో టీం ఇండియా 3 ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనగా, మూడు టోర్నీలలో కలిపి భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్ ను మాత్రమే ఓడిపోవటం విశేషం. ఆ ఓడిన మ్యాచ్ గురించి అభిమానులకు ప్రత్యేక ప్రస్తావన ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆసీస్ చేత ఫైనల్స్ లో పరాజయాన్ని చవిచూసింది టీం ఇండియా. అయితే, పెను ప్రమాదానికైనా మహా కార్యానికైనా పునాది పడేది ఎదురు దెబ్బ నుండే. గాయం రుచి తెలిసినపుడే విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు. అదే తీరులో, ఆ 2023 వన్-డే వరల్డ్ కప్ తరువాత భారత మెన్స్ జట్టు రెండు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనగా, రెండు ట్రోఫీలను ఎగరేసుకుపోయారు.
అప్పట్లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో టి-20, వన్-డే వరల్డ్ కప్లు మరియు ఛాంపియన్స్ ట్రోఫీ ను అందుకుని భారత్ తమ ఆధిపత్యాన్ని చలాయించింది. ఏమైందో ఏమో గాని, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తరువాత మరో 11 ఏళ్ళ పాటు మరొక ఐసీసీ ట్రోఫీ ను ముద్దాడే భాగ్యం కలగలేదు టీం ఇండియా కు.
ప్రతి టోర్నీలోను సెమి-ఫైనల్ కు అర్హత సాధించటం, ఆ సెమిస్ లో ఓడి ఇంటి దారి పట్టటం.. లేదా ఫైనల్ లో గాడి తప్పి మ్యాచ్ ను కోల్పోవటం. 11 ఏళ్ళ పాటు ఇదే జరిగింది. కానీ, 2023 వన్-డే వరల్డ్ కప్ లో భారత్ మునుపటి టీం ఇండియా లా కాకుండా ఈసారి తప్పకుండ ట్రోఫీ మనదేననే సంకేతాలెన్నో ఇచ్చింది.
సొంత గ్రౌండ్లలో మ్యాచ్లు, జట్టులో భాగమయిన ప్రతి ఆటగాడు తమ ప్రైమ్ ఫామ్ ను అందుకోవటం, ఫైనల్ కు చేరేంతవరుకు ఒక్క మ్యాచ్ ను కూడా ఓడకుండా , ఓటమి రుచి ఎరుగకుండా ఫైనల్ ను చేరింది భారత్. అయితే అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా భారత్ చివరి మ్యాచ్లో ఓటమి పాలయి కప్ ను చేజార్చుకుంది.
ప్రతి కథకు ఇంటర్వెల్ ఉన్నట్టే, ఈ 2023 వన్-డే వరల్డ్ కప్ మన భారత క్రికెట్ కు ఇంటర్వెల్ వలె బ్రేక్ వేసింది. ఇక 2nd హాఫ్ ఎలా ఉంటుందోనాని ఆందోళన పడ్డారు అభిమానులు. అభిమానులే కాదు ఆటగాళ్లు సైతం ఆ ఓటమి తరువాత మానసికంగా దృఢపడేందుకు కాస్త సమయం పట్టింది.
ఇక 2nd హాఫ్ 2024 టి-20 వరల్డ్ కప్ తో మొదలయింది. పెద్ద అంచనాలేమి లేకుండానే మొదలయిన ఈ టోర్నీ, వెళ్లే కొద్దీ రసవత్తరంగా రూపొంది చివరికి 11 ఏళ్ళ భారత ఐసీసీ కప్పు ద్రవాహాన్ని తీర్చిపెట్టింది. ఈ మ్యాచ్ అనంతరం రో-కో లు పొట్టి ఫార్మటు కు గుడ్ బాయ్ చెప్తూ, కొత్త జెనరేషన్ ఆటగాళ్లకు దారిచ్చారు.
అదే బాటలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ను కూడా భారత్ బుట్టలో వేసుకుంది. ఆ టోర్నీ ప్రారంభానికి ముందునుండే హాట్-ఫెవరెట్స్ గా ఉన్న టీం ఇండియా అనుకున్న స్థాయిలోనే ప్రదర్శించి కప్పును ఎత్తుకెళ్లిపోయారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు ధీటైన పోటీ ఇచ్చినప్పటికీ భారత్ ఓటమి రుచి ఎరుగకుండానే కప్పును కైవసం చేసుకున్నారు.
ఇక, ప్రస్తుతం జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ లో సైతం భారత్ ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో ఆడిన 4 కు 4 మ్యాచ్లను గెలిచి టేబుల్ టాపర్ గా సూపర్-8’s కు అర్హత సాధించారు. కప్పు కొట్టే వేటలో ఇంకా భారత్ 5 మ్యాచ్ల దూరంలో ఉన్నది. మరి ఆ 2023 వన్-డే వరల్డ్ కప్ తరువాత భారత్ ఇప్పటి దాకా ఐసీసీ ఈవెంట్లలో ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడలేదు, ఈ టి-20 వరల్డ్ కప్ ను కూడా భారత్ అజేయంగా గెలుచుకుంటుందా..? చూడాలి మరి..!







