2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మద్యనే పోటీ అన్నట్లు సాగాయి. కానీ 2028 ఎన్నికలు మాత్రం ఆవిధంగా ఉండబోవని ఇప్పటికే స్పష్టమైంది.
ఈసారి ఎట్టి పరిస్థితులలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. లేకుంటే ఆ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
కానీ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అధికారంలోకి రానీయనని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే శపధాలు చేస్తున్నారు. ఆయనకు శపధాలు నేరవేర్చుకోగల శక్తి సామర్ధ్యాలు, రాజకీయ చతురత పుష్కలంగా ఉంది. కానీ అయన పాలన పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి తమకు వరంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆశపడుతోంది.
ఇక పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని ఇటీవలే ప్రధాని మోడీ ప్రకటించారు. బిజేపి అధిష్టానం ‘స్పాట్ పెట్టిన’ ప్రతీ రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూనే ఉంది. కనుక ప్రధాని మోడీ మాటలని లైట్ తీసుకోలేము. కనుక ఈసారి ఎన్నికల బిజేపిని గెలిపించుకునేందుకు మోడీ-అమిత్ షాలు ఎటువంటి వ్యూహం అమలుచేస్తారనేది ఆసక్తికరం.
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఈసారి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీతో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయినా కనీసం 20-30 సీట్లు సాధించుకుంటే ‘కింగ్ మేకర్’ కాగలదు. లేకుంటే ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టం. కనుక ఆమె సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం.
గత ఎన్నికలలోనే జనసేన పోటీ చేసింది. వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈసారి రెండేళ్ళ ముందు నుంచే పార్టీని ఎన్నికలకు సన్నధం చేసుకుంటున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో జనసేన ప్రభావం కూడా బాగానే ఉండవచ్చు.
ఇవన్నీ కాకుండా రాజకీయ సమీకరణాలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిజేపి-జనసేన కలిస్తే ఓవిధంగా, ఒకవేళ బిజేపి-బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపితే మరో విధంగా ఎన్నికల ఫలితాలు ఉండవచ్చు.
అలాగే టీడీపి పోటీ చేస్తే ఒక విధంగా, చేయకపోతే మరోవిధంగా ఫలితాలు ఉండవచ్చు. కనుక వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు అగ్నిపరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది.




