ఈరోజు ఉదయం 10.30 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఏవిదంగా అవినీతికి పాల్పడ్డారో తెలంగాణ ప్రజలను ఏవిదంగా మోసగించారో, ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసమే ప్రత్యేకంగా ఈ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నాలుగైదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లోనే ఈ ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అంతా అయిన మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోబోతోంది.
కానీ ఈ ప్రాజెక్టులో ఎక్కడా అవినీతి జరుగలేదని, కేసీఆర్ని అప్రదిష్టపాలు జేసి బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. నేటికీ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టే గుండెకాయ వంటిదని, కానీ కాళేశ్వరం కమీషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమని రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆ నివేదికని శాసనసభలో చర్చకు పెట్టి తమపై రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వాదిస్తున్నారు.
కనుక ఈసారి కేసీఆర్ తప్పకుండా శాసనసభకు వచ్చి కాంగ్రెస్ మంత్రులపై ఎదురుదాడి చేసి వారి నోళ్ళు మూయిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా కేసీఆర్ మొహం చాటేశారు!
హరీష్ రావు, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే సభకు హాజరయ్యారు. కనీసం రేపటి నుంచయినా కేసీఆర్ వస్తారో లేదో తెలీదు.
శాసనసభలో కాళేశ్వరం నివేదికపై చర్చ తప్పదని బీఆర్ఎస్కు అర్దమైంది. అందుకే ప్రతివ్యూహంగా ఎన్నికల హామీల అమలు, యూరియా కష్టాలు, వరద కష్టాలు పంట నష్టం తదితర ప్రజా సమస్యలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నిర్ణయించుకుంది.
కానీ కేసీఆర్ శాసనసభకు వచ్చి ధైర్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఉంటే మరోలా ఉండేది. కానీ అయన రాకుండా ఇటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.





