కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్’ మరియు ‘నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ 46 అవార్డులలో 13 అవార్డులను తెలంగాణ పంచాయతీలు, గ్రామాలు గెలుచుకొన్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయా గ్రామాల మహిళా సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అవార్డులు అందుకొన్నారు. తెలంగాణలో ఆయా గ్రామపంచాయతీలకు రూ.12.50 కోట్లు నగదు బహుమతి కూడా అందుకొన్నారు. కానీ ఏపీకి ఒక్క అవార్డు కూడా లభించలేదు.
వైసీపీ ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు అందించకపోగా, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా అందించే నిధులను కూడా వేరే అవసరాలకు వాడేసుకొంటున్నందునే ఈ దుస్థితి ఏర్పడిందని ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పొరుగు రాష్ట్రంలో కేంద్రం అందించే నిధులతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోందని అందుకే అన్ని అవార్డులు అందుకోగలిగిందని అన్నారు.
ఏపీ ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో సర్పంచ్ల సంక్షేమ సంఘం ప్రతినిధులే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ని, వారి కార్యదర్శి సునీల్ కుమార్ను కలిసి గోడు వెళ్లబోసుకొన్నామని చిలకలపూడి అప్పారావు చెప్పారు. అప్పుడు వారు 15వ ఆర్ధిక సంఘం ఏపీ గ్రామపంచాయితీలకు సిఫార్సు చేసిన రూ.2010 కోట్లు మంజూరు చేయాలంటే, ముందుగా ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకా, అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వాడేసుకొంటే ఇక గ్రామాలలో అభివృద్ధి పనులు ఏవిదంగా చేపట్టాలని ప్రశ్నించారు. కనుక ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయాలని ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి అప్పారావు విజ్ఞప్తి చేశారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పే మాట ఒకటే. తన ప్రభుత్వం ప్రతీ ఇంటికీ మేలు చేస్తోందని. అంటే సంక్షేమ పధకాల పేరుతో డబ్బు ముట్టజెప్పుతున్నామని. దాని కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు కూడా. కానీ వాటితో కనీసం లబ్దిదారుల జీవితాలు కూడా మారలేదు! వాటితో వైసీపీకి ఓట్లు రాలుతాయని ఆశపడుతోంది తప్ప అదే సొమ్ముని ఈవిదంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధిపనులకు వినియోగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాంతో తమ ప్రభుత్వానికి, సిఎం జగన్మోహన్ రెడ్డికి ఇంకా మంచిపేరు, ప్రజాధారణ, ఖచ్చితంగా ఓట్లు పడతాయని గ్రహించలేకపోతోంది.
ఒక పాలకుడికి దూరదృష్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉంటే ఏవిదంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం తెలియజెప్పుతోంది. ఆ ఆలోచన, లక్షణాలు లేకపోతే ఏవిదంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ నిదర్శనంగా కనిపిస్తోంది.



