తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్, ఆయన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నారో అందరూ విన్నారు. ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాలలో అది కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్.
నభూతో… నభవిష్యత్ వంటి ఇంత గొప్ప ప్రాజెక్టుని కేవలం మూడున్నరేళ్ళలో పూర్తి చేశాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక్క గొప్ప ప్రాజెక్టు నిర్మించలేకపోయింది. ఇక ఎన్ని కరువు కాటకాలు వచ్చినా తెలంగాణకు నీటి కరువు ఉండదు. దీంతో రాష్ట్రం పచ్చబడితే ప్రతిపక్షాల కళ్ళు అసూయతో ఎర్రబడుతున్నాయి… ఇలా చాలానే చెప్పుకొన్నారు.
ఇవన్నీ నిజమే… ఒకప్పుడు బీడువారిన తెలంగాణ భూములలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి. ఏడాది పొడవునా రాష్ట్ర వ్యాప్తంగా కాలువలలో గోదావరి నీళ్ళు ప్రవహిస్తుంటే తెలంగాణ ప్రజల, రైతుల ఆనందానికి అంతే లేదు.
సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని మరీ కట్టించిన ఇంత అద్భుతమైన ప్రాజెక్టు అప్పుడే ఎందుకు బీటలు వారింది? మేడిగడ్డ బ్యారేజి అప్పుడే ఎందుకు క్రుంగిపోయింది? అన్నారం బ్యారేజీలో నీళ్ళు ఎందుకు లీక్ అవుతున్నాయి? ఆ గోడలలో పగుళ్ళు ఏమిటి?అని కాంగ్రెస్ మంత్రులే ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలని సందర్శించి దెబ్బ తిన్న భాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ వారికి అక్కడే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ ఓ బాంబు పేల్చారు!
మేడిగడ్డ బ్యారేజి 7వ బ్లాకులో క్రుంగిన మూడు పియర్స్ మరమత్తులు చేయడం సాధ్యం కాదని వాటిని పునాదులతో సహా పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్తగా నిర్మించాలని చెప్పారు. ఇది చాలా భారీ ఖర్చుతో కూడిన పని మాత్రమే కాదు. బ్యారేజీలో నిలువ ఉంచిన 10 టీఎంసీలు నీళ్ళని ఖాళీ చేసేయాలని చెప్పారు.
కేసీఆర్ స్వయంగా దగ్గరుండి నిర్మింపజేసిన ఇంత గొప్ప ప్రాజెక్టులో మూడేళ్ళు తిరక్కుండానే ఎందుకు ఇలా క్రుంగిపోయింది? దీని క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకొన్నప్పుడు, ఈ లోపానికి, ఈ నష్టానికి అన్నిటికీ కూడా ఆయనే బాధ్యత వహించాలి కదా?
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పదే…. కానీ కాంగ్రెస్ నేతలు చెపుతున్నావన్నీ అబద్దాలే అని వితండవాదం ఎందుకు చేస్తున్నారు? బీడువారిన తెలంగాణ భూములకు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు అందించాలనే ఆలోచన, తపన అభినందనీయమే. కానీ అన్ని నాకు మాత్రమే తెలుసనే ధోరణిలో తెలంగాణ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచిపోవాలనే తాపత్రయంతో చేసిన హడావుడి నిర్మాణమే కొంప ముంచిందని చెప్పక తప్పదు.
బ్యారేజి గోడల పగుళ్ళు ఏర్పడి, క్రుంగిపోయిన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటే, కేంద్ర నిపుణుల కమిటీయే ఈ విషయం చెప్పినప్పుడు ఇంకా కేటీఆర్ బుకాయింపులు దేనికి? అంటే దీనిపై రాజకీయం చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానించాల్సి ఉంటుంది.




