తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పదేళ్ళలో పూర్తిగా నిర్వీర్యం చేసీనా శాసనసభ ఎన్నికలకు 3-4 నెలల ముందు హటాత్తుగా పుంజుకొని కేసీఆర్ని గద్దె దించి అధికారంలోకి వచ్చింది. రాజకీయ మేధావులు, ఎన్నికల వ్యూహ నిపుణులు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు.
ఆ ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలను కట్టడి చేసుకుంటూ, కేసీఆర్ని ఢీ కొంటుంటే, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తరలివచ్చి ఆయనకు బాసటగా నిలిచారు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి పూర్తి సహాయాసహకారాలు అందిస్తూ చాలా తోడ్పడింది. వీటన్నిటికీ తోడు కేసీఆర్ వైఖరి పట్ల తెలంగాణ ప్రజలలో తీవ్ర అసంతృప్తి కూడా కాంగ్రెస్ విజయానికి ఎంతగానో తోడ్పడింది.
ఇప్పుడు ఏపీ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే ఫార్ములాతో జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
కేసీఆర్ పాలన, తెలంగాణ అభివృద్ధితో పోలిస్తే జగన్ ప్రభుత్వ పాలన చాలా నాసిరకంగా ఉందనే విషయం అందరికీ తెలుసు. ఏపీలో నెలకొన్న ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బాగానే గుర్తించింది.
జగన్మోహన్ రెడ్డి పక్కన పడేసిన బాణన్ని ఆయనపైకి ప్రయోగించింది. ఆ బాణం కూడా ఏమాత్రం సంకోచించకుండా రివ్వున దూసుకువచ్చి వైసీపి నేతల గొంతులో చేపముల్లులా గుచ్చుకొని చాలా ఇబ్బంది పెడుతోంది.
ఇటీవలే వైఎస్ షర్మిల హైదరాబాద్లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్కు అండగా నిలబడతానని ఆయన ఇదివరకు ఆమెకు హామీ ఇచ్చారు.
కనుక ఈ నెల 25వ తేదీన తిరుపతిలో ఆమె అధ్వర్యంలో నిర్వహించబోయే బహిరంగ సభలో తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ అమలుచేసి విజయం సాధించిన ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నారన్న మాట!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఎంతగా నిర్వీర్యం చేసినప్పటికీ ఆ పార్టీ నేతలు, క్యాడర్ చెక్కు చెదరలేదు. గత పదేళ్ళుగా కేసీఆర్తో పోరాడుతూనే ఉంది. కనుక అన్నీ కలిసిరావడంతో కేసీఆర్ని ఓడించి అధికారంలోకి రాగలిగింది.
కానీ ఏపీలో వైసీపి, టిడిపి, జనసేనలు మూడూ చాలా బలంగా ఉండగా, గత పదేళ్ళుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు.
కనుక ఎన్నికలకు రెండుమూడు నెలల ముందు వైఎస్ షర్మిల, తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు వచ్చి ఎంత హడావుడి చేసినా గెలిచే అవకాశం ఉండదు. కానీ అందరూ కలిసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలరు!




