నరం లేని నాలుక ఎంత పని అయినా చేస్తుందనేది పెద్దల మాట. అదే స్వరం రాజకీయ నాయకులదైతే, ఇంకేముంది… సొంత పార్టీ విషయానికి వస్తే ఓ మాట, ఇతర పార్టీల విషయానికి వస్తే మరో మాట. ముఖ్యంగా నీతులు చెప్పే రాజకీయ నాయకులు అలాంటి వాటిని అస్సలు పాటించరనే చెప్పాలి. ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ మంత్రి వర్యులు కేటీఆర్ కూడా ఉన్నారనే విధంగా తాజాగా చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.
తెలంగాణా ఐటీ కారిడార్ లో చంద్రబాబు మద్దతుగా చేస్తోన్న నిరసనలను అణగద్రొక్కిన తెరాస పార్టీ, ఇపుడు కేటీఆర్ ద్వారా అందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అది ఏపీలోని రెండు పార్టీల విషయమని, దానికి తెలంగాణతో సంబంధం లేదని, ఆ రెండు పార్టీలకు కూడా తెలంగాణలో మనుగడ లేదని, దీనిపై తామెందుకు స్పందించాలని అన్నారు.
ఐటీ కారిడార్ లో నిరసనలను అనుమతి ఇస్తే నేడు టీడీపీకి మద్దతుగా ఒకరు చేస్తే, రేపు మరో పార్టీ అదే ప్రయత్నం చేస్తుందని, అది శాంతి విఘాతాలకు భంగం కలుగుతుందని, తెలంగాణాలో మా ప్రభుత్వం ఉందని, ఇక్కడ పరిస్థితులను అదుపులో ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందని తనదైన శైలిలో చూడచక్కగా వివరించారు.
కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఏపీలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరుగా చంద్రబాబు అరెస్ట్ ను అభివర్ణించారంటే, కేసులకు అతీతంగా వైసీపీ చేస్తోన్న రాజకీయ కక్షను పరోక్షంగా కేటీఆర్ చెప్పినట్లే కదా! అయితే నిరసనల విషయానికి వచ్చేపాటికి తమకో న్యాయం, పరులకోన్యాయం అన్న రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.
గతంలో మహారాష్ట్ర ఎన్నికలలో టీఆర్ఎస్ చేసిన హడావుడి రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. మరి అలాంటి టీఆర్ఎస్ నేడు హైదరాబాద్ లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న నిరసనలను ఏ విధంగా అడ్డుకోగలరు? అందులోనూ రాజకీయాలకతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తోన్న నిరసనలను అడ్డుకోవడం అంటే, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే కదా? కాస్త ఆలోచించండి కేటీఆర్ గారు!



