30 లక్షల మందికి రేషన్ కార్డులు…పేదరికం పెరుగుతుందా.? తగ్గుతుందా.?

Telangana Minister Uttam Kumar Reddy

ప్రతి రాజకీయ పార్టీ మా ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది, అభివృద్ధిలో మనదే నెంబర్ వన్, సంక్షేమంలో మనమే ఆదర్శం, మా హయాంలో రాష్ట్రంలో పేదరికం తగ్గింది, పేదలంతా సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు అంటు డబ్బాలు కొడతారు.

అయితే అసలు వాస్తవానికి వస్తే గత ప్రభుత్వంలో 20 లక్షల ప్రభుత్వ లబ్దిదారులుంటే మా ప్రభుత్వంలో ఆ సంఖ్యను 30 లక్షలకు పెంచాం, మీ హయాంలో 2 లక్షల పేదలకు ఇళ్లిస్తే మా హయంలో 4 లక్షల మంది పేదలకు వసతి కల్పించాం అంటు చెపుతున్న రాజకీయ పార్టీలు రాష్ట్రంలో పేదరికాన్ని పెంచుతున్నారా.? తగ్గిస్తున్నారా.? అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.?

ADVERTISEMENT

గత పదేళ్ళు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిన బిఆర్ఎస్ పెద్దలు మా హయాంలో అనేక సంక్షేమ పథకాలు అందించాం, పేదలు గౌరవప్రదంగా జీవించేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చాం, పారిశ్రామిక ప్రగతితో వారి జీవన ప్రమాణాలను పెంచాం, వారిని పేద వారి స్థాయి నుంచి మధ్యతరగతి స్థాయికి తెచ్చాం అంటు గొప్పలు చెప్పుకున్నారు.

అయితే బిఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఆ స్థాయిలో పేదవారు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గాల్సింది పోయి ఈ స్థాయిలో ఎందుకు పెరిగింది.? ఇది ఒక్క బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల సమస్యలే కాదు ఏవత్ దేశంలోని అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు, ఆ పార్టీల ప్రభుత్వాలది ఇదే పరిస్థితి.

ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత సంక్షేమాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గాల్సింది పోయి నానాటికి వీరి సంఖ్య ఎందుకు పెరుగుతుంది.? అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పేదరికంలో ఉన్నవారు పైకి రావడం కాదు పేదరికానికి దూరంగా ఉన్న మధ్య తరగతి ప్రజలు పేదవారుగా మారుతున్నారన్న మాట.

ప్రభుత్వాలు ఇచ్చే ఈ ఉచితాలు అటు రాష్ట్ర ఖజానాతో పాటుగా ఇటు మధ్యతరగతి వాడికి కూడా మోయలేని భారంగా మారుతున్నాయి. ఉచితాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అబ్బిడిముబ్బడిగా దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ, కనిపించిన వాటన్నిటి పై ధరలను పెంచుకుంటూ పోతుంది. ఇటు కరెంట్ చార్జీల నుంచి అటు బస్సు చార్జీల వరకు బాదుడే బాదుడు అన్నట్టుగా చార్జీల పెంపు మోత మోగిస్తున్నారు.

అయితే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ తాజాగా చేసిన ఒక స్టేట్ మెంట్ సామాన్యుడిలో ఈ తరహా అనుమానాలకు తావిచ్చింది. ఇప్పటికే తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకు మించిన భారంలా మారిపోయింది. ఇప్పుడు అదిచాలదు అన్నట్టుగా మరో 30 లక్షల మందికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అంటే మరో 30 లక్షల కుటుంబాలకు ఈ సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సిందేనన్న మాట.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలలో వైట్ రేషన్ కార్డు అనేది ఒక అక్షయ పాత్ర మాదిరి తయారయ్యింది. వైట్ కార్డు ఉంటె నవరత్నాలు, సూపర్ సిక్స్ లు, ఆరు గ్యారెంటీల అమలు ఇలా ఏ పార్టీ మేనిఫెస్టో కు అర్హత పొందాలన్న చేతిలో రేషన్ కార్డు ఉండాల్సిందే.

కార్డు ఉండే చాలు ఉచిత బియ్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్యా, ప్లస్ అదనంగా పిల్లాడికి 15 వేలు, సబ్సిడీ ధరలతో గ్యాస్, ఉచిత కరెంట్, తులం బంగారం, షాదీ ముబారక్…ఇలా చేతిలో రేషన్ కార్డు ఉందా ప్రభుత్వ పథకాలన్నీ ఇంటి ముందుకే వచ్చి వెళుతున్న వైనాలు చూస్తున్నాం.

అయితే పేదలకు ప్రభుత్వాలు సాయం చేయడాన్ని ఎవరు తప్పుబట్టారు, కానీ ఆ పేదరిక నిర్ముల పేరుతో పార్టీలు తమ రాజకీయ సౌలభ్యం కోసం, వారి పదవి కాంక్ష కోసం ఇలా సంక్షేమం పేరుతో సమాజంలో పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు.

ఇది ఎప్పటికైనా ప్రమాదకరంగా మారక తప్పదు. ఈ జాడ్యానికి ఎక్కడో ఒక దగ్గర రాజకీయ పార్టీలన్నీ కలిసి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇక భవిష్యత్ తరానికి భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు అభివృద్ధి చెందాల్సిన దేశంగా చెప్పుకోవాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories