ఎన్నికకు విలువ కడుతున్నారా.?

Political parties offering cash rewards in Telangana Panchayat elections

రాజకీయాలలో ఒకప్పటి విలువలు, ఎన్నికలకు మునుపటి గౌరవం ప్రస్తుతం ఉంటున్నాయా.? వాటిని రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు అదే విధంగా ఉంచుతున్నారా.? అంటే కాదనే సమాధానమే వస్తుంది.

పార్టీలు ఏమైనా, రాజకీయ నేతలు ఎక్కడి వారైనా ఎన్నికలు అంటే సాధారణ ఓటర్లకు ఇది నీ ఓటు హక్కు విలువ అంటూ ఒక వెలను నిర్దేశించి అందుకు తగ్గట్టు వారి వద్ద నుండి ఓటు హక్కును తమకు, తమ పార్టీకి అనుకూలంగా కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ కొనుగోళ్ళ విషయంలో కొన్ని కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలు, పార్టీ నేతలు ఓటర్ల చేతులో మోసపోతుంటారు కూడా. అయినా మళ్ళీ ఎన్నికలు అనగానే ఇక ఓటుకి నోటు అంశాన్ని తెరమీదకు తెస్తారు. ఇందులో ఏ ఒక్క పార్టీ కి మినహాయింపు పొందే అవకాశమే లేదు.

అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటుకు విలువ కట్టే పార్టీలు, నేతలు ఇక పార్టీల ప్రభావం లేని పంచాయితీ ఎన్నికలు వంటి వాటి విషయంలో పోటీదారునికి వెల నిర్ణయిస్తున్నారు. మా పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 5 లక్షల నజరానా అంటూ ఒక పార్టీ,

లేదు మా పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 10 లక్షల బహుమతి అంటూ మరో పార్టీ ఇలా పార్టీలు తమ స్థాయిని, స్థానికంగా తమకు ఉన్న బలాన్ని, తమ పార్టీకి ఉన్న ఆర్థిక వెసులుబాటుని ఆధారం చేసుకుని ఎన్నికలను వేలం పాట మాదిరి, చీటి పాట లెక్క మార్చేస్తున్నారు.

ఇందుకు తాజాగా తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు బహిరంగంగా అంగడిలో సరుకుల మాదిరి నా విలువ ఇది, నా పార్టీ ఆర్థిక బలం ఇంత అంటూ ప్రకటనలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.

రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు చేసే ఈ బహిరంగ ప్రకటనల పై, వారు ప్రోత్సహిస్తున్న వేలం విధానాలా పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్ తరానికి ఎన్నికలు ఒక బజారులో జరిగే సంత మాదిరి కనిపించే ప్రమాదం ఉందంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.

ADVERTISEMENT
Latest Stories