సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా వినిపించే మాట ‘తొక్కేయడం.’ ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కేస్తారో గానీ, ఈ మాట మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరి నోట నుండి వెలువడుతూనే ఉంటుంది. తాజాగా నటి హేమ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే ఇది రాజకీయాలను ప్రస్తావిస్తూ చేయడం మరింత విశేషం. తెలుగు సినిమాలాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ ఫుల్ బిజీ. అలాంటి హేమ, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తన భావాలను వ్యక్తపరిచింది.
కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా, అసలు కాపులను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా వున్నారని హేమ ఆరోపణలు చేసింది. కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సుకు హాజరైన హేమ, ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు తనంతట తానుగా ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. కాపు ఉద్యమంలో పాల్గొంటే సినీ పరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తారన్న భయం లేదని తెలిపింది. తానిచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చుకోవాలని డిమాండ్ చేసింది.
గత ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైఖ్యాంధ్ర’ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన హేమ చేసిన ఆరోపణలకు ఎంత విలువన్నది పక్కన పెడితే, ఒక సినీ సెలబ్రిటీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హేమ నోటి వెంట రాజకీయాలు రావడం, అది కూడా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడంతో, ఈ నటిమణి వ్యాఖ్యలకు ప్రాధాన్యత లభించింది. బహుశా వచ్చే ఎన్నికలలో మరొక పార్టీ టికెట్ కోసం ఇప్పటినుండే సన్నాహాలు చేసుకుంటుందేమో అన్న టాక్ వినపడుతోంది.



