సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున అంటే జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 175/175 సీట్లు మావే అనుకున్న వైసీపీకి కేవలం 11 సీట్లతో సరిపెట్టి గద్దె దించేశారు.
చక్కగా రాష్ట్రాన్ని పాలిస్తారనే నమ్మకంతో భారీ మెజార్టీతో ప్రజలు అధికారం కట్టబెడితే, అది తన గొప్పదనమేననుకొని మిడిసిపడినందుకు, ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోకుండా వైసీపీ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినందుకే గద్దె దించేశారు.. అని నేటికీ అంగీకరించడం లేదు. అమరావతిని వ్యతిరేకిస్తూ మావిగన్ అనడం ఇందుకు ఓ చక్కటి నిదర్శనం.
ప్రజలు సంక్షేమ పధకాలు కాదు… అభివృద్ధి, స్వావలంభన కోరుకుంటారు. ప్రశాంతంగా జీవించాలనుకుంటారు. తమ రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటారు… అని సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఆయన ఆలోచనాధోరణి కూడా ఆవిధంగానే ఉంటుంది.
కనుక ఈ రెండేళ్ళలో ఒకే సమయంలో రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేయిస్తున్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులతో అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయిస్తున్నారు.
కనుక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ప్రజలకు చెప్పుకోవడానికి చాలా పెద్ద జాబితాయే ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వంతో బలమైన సత్సంబంధాలున్నాయి.
కానీ వైసీపీకి చెప్పుకోవడానికి ఏముంది? అని అడిగితే ‘మమ్మల్ని గెలిపిస్తే రప్పా రప్పా చేస్తాము. అమరావతి పనులు మళ్ళీ నిలిపివేసి ‘మావిగన్’ పాట పాడుతాము. అభివృద్ధి పనులు పక్కన పడేసి మళ్ళీ సంక్షేమ పధకాలు భుజానికి ఎత్తుకుంటాము. వైసీపీ రంగులు, ఫోటోలు, పేర్లు, కూల్చివేతలు, మూసివేతలు ఎలాగూ ఉండానే ఉంటాయని’ చెప్పుకోవాల్సి వస్తుంది.
వైసీపీ ఈ విధానాలకు ఇంత బలంగా కట్టుబడి ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు, కూటమి ప్రభుత్వం అదృష్టమనే చెప్పాలి. థాంక్యూ జగన్!




