ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు గెలుచుకుంటామని పోలింగ్ ముందు రోజు వరకు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మర్నాడే గత ఎన్నికల కంటే ఎక్కువ గెలుస్తామని సవరణ ప్రకటన చేశారు.
అయితే ఈసారి వైసీపి ఓటమి తధ్యం… అది కూడా… వైసీపి, వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట కడప నుంచే మొదలయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కడప జిల్లాలో ఈసారి వైసీపి ఓడిపోతే ఆ క్రెడిట్లో సింహభాగం వైఎస్ షర్మిలకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ ఆమె ఒక్కరికే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఆమెను గెలిపించమని ప్రజలను కోరినందుకు విజయమ్మకి, ఆమెకు మద్దతుగా అవినాష్ రెడ్డితో పెద్ద యుద్ధమే చేసిన సునీత రెడ్డికి, వారికి ఈ అవకాశం కల్పించిన అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కూడా వైసీపి ఓటమి క్రెడిట్ తప్పక లభిస్తుంది.
ఈసారి కడప జిల్లాలో కడప, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలలో వైసీపి-కూటమికి మద్య హోరాహోరీగా పోటీ జరిగింది. పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాలలో మాత్రం వైసీపికి ఏకపక్షంగా జరిగిన్నట్లు తెలుస్తోంది.
కడప కంచుకోటలో వైసీపికి ఎదురుగాలి ఎందుకు వీస్తోంది? అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కారణం కనిపిస్తోంది.
ఉదాహరణకు జగన్కు అత్యంత సన్నిహితుడు అంజాద్ బాషా, ఆయన తమ్ముడు, వారి అనుచరులు గత 5 ఏళ్లుగా కడపలో హిందువుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా పేట్రేగిపోయారు. అయినా జగన్ అంజాద్ బాషాకే టికెట్ ఇచ్చారు. ఒకవేళ బాషా ఏమైనా తప్పులు చేసి ఉంటే తన మొహం చూసి పెద్ద మనసుతో మన్నించి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని జగన్ కోరారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసు భూతంలా వెంటాడుతుంటే, షర్మిల, సునీత కలిసి ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. విజయమ్మ చేత షర్మిలకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పించుకోగలిగారు.
‘సిఎం జగన్ మా పులివెందులవాడు’ అని ప్రజలు చెప్పుకోవడం తప్ప ఈ 5 ఏళ్లలో ఏనాడూ ప్రజలని పలకరించిన పాపన్న పోలేదు. అవినాష్ రెడ్డికి పులివెందుల బాధ్యత అప్పగిస్తే, వివేకా హత్య కేసు ఆయన మెడకి చుట్టుకోవడంతో ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు.
కమలాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డికే మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఆయన జగన్కు మేనమామ అనే ఒకే ఒక్క కారణంతో గెలుస్తున్నారు తప్ప కమలాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. కనీసం స్థానిక ప్రజలతో కూడా ఆయనకు సత్సంబంధాలు లేవు.
అయితే కడప మా కంచుకోట అనే గుడ్డి భ్రమలో ఉన్నందున జగన్ మొదలు అవినాష్ రెడ్డి వరకు ఏ ఒక్కరూ ప్రజల గోడు పట్టించుకోలేదు.
విజయమ్మ కూడా అవినాష్ రెడ్డిని కాదని వైఎస్ షర్మిలని గెలిపించమని చెప్పేశారు. కనుక “ఒక్క షర్మిలనే ఎందుకు? ఈసారి కూటమి అభ్యర్ధులందరినీ గెలిపించి తమను చులకనగా చూస్తున్న వైసీపి నేతలకు గడ్డి పెడదాము,” అని కడప కంచుకోటలో బందీలుగా జీవనం సాగిస్తున్న సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
కనుక ఈసారి వైసీపి ఓటమి కడప గడప నుంచే మొదలవుతుంది. ఈ ఓటమి క్రెడిట్ వైసీపిలో జగన్ మొదలుకొని జిల్లా నేతలందరికీ, విజయమ్మకి, షర్మిల, సునీతా రెడ్డి అందరికీ సమానంగా దక్కాల్సిందే.




