రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తుంటే సహజంగానే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది కనుక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.
కానీ గత ప్రభుత్వం అభివృద్ధికి బదులు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ, ఓటు బ్యాంకు నిర్మించుకోవాలనుకుంది. ఆ ఆలోచన వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.
అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, మౌలిక వసతుల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయనకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ వలన ఏపీకి మళ్ళీ భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తున్నాయి.
వాటితో పాటు కొన్ని అమరావతి, పోలవరం, దుగ్గరాజపట్నం పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులు కూడా సమాంతరంగా చేపట్టి ముందుకు నడిపిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో దుగ్గరాజపట్నం వద్ద నౌకాశ్రయంతో పాటు నౌకల తయారీ, మరమత్తుల కోసం షిప్ బిల్డింగ్ క్లస్టర్, వాటిని అనుసంధానం చేస్తూ రైల్వే లైన్, రోడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థలు, వాటికి అనుబంధంగా పరిశ్రమలు, కార్గో హ్యాండ్లింగ్, ఎగుమతి, దిగుమతులకు సంబంధించి సంస్థల ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వీటన్నిటిపై అధ్యయనం చేసి 15 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
సుమారు రూ.50-60,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్టు కోసం ఏపీ మారిటైం బోర్డు, విశాఖపట్నం పోర్టు అధారిటీ ఒప్పందం చేసుకున్నాయి. వీటికి నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ లిమిటెడ్ పేరిట ఇవి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక తయారు చేసి ఇచ్చేందుకు బిడ్స్ ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది కూడా.
ఇలాంటి ఒక్క భారీ ప్రాజెక్టు ఏర్పాటయితే రాయలసీమ జిల్లాలలో వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా భారీగా ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మరింత మెరుగుపడుతుంది.
కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కావాలంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ రాజకీయ ప్రయోగాలు చేయకూడదు. లేకుంటే అమరావతితో సహా అన్ని ఎక్కడివక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.




