‘భవనాలు’ లేని అమరావతి సినీ ‘సెలబ్రిటీల’కు వద్దా?

Celebrities Ignored Krishna Pushkaralu,Tollywood Celebrities Ignored Krishna Pushkaralu, Celebrities Ignored Krishna Pushkaralu Amaravati, Heores Pushkaraluఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని ఘనంగా ముగించింది. గత 12 రోజులుగా విజయవంతంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలకు… కడియం నుండి ప్రత్యేకమైన పూలు, ఆస్ట్రేలియా నుండి బాణసంచా తెప్పించి, కృష్ణానదీ తీరాన్ని వెలుగు జిలుగులతో నింపి… బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఘనమైన హారతి కార్యక్రమంతో వీడ్కోలు పలికారు. అయితే ఈ 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలను మన తెలుగు సినీ పరిశ్రమ హీరోలు పూర్తిగా విస్మరించడం విశేషం.

ఒక్క విక్టరీ వెంకటేష్ మినహా తెలుగు సినీ పరిశ్రమ అగ్ర హీరోలు కనీసం కన్నెత్తి కూడా కృష్ణమ్మ వైపుకు చూడకపోవడం శోచనీయమైన అంశం. బాలకృష్ణ హాజరైనప్పటికీ, టిడిపి ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన సభ్యుడిగా బాలయ్య హాజరును లెక్కించలేం. ఇక, పార్టీలతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏపీ సర్కార్ అందరికీ పుష్కర ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఆఖరికి ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబును కూడా వదలకుండా ఆతిధ్య ఆహ్వానం పలకగా, చివరికి అశేష అభిమానులు గల అగ్ర హీరోల కంటే.., సంపూనే నయమనిపించే విధంగా పుష్కర స్నానం ఆచరించాడు. అయితే అసలెందుకు మన హీరోలంతా కృష్ణమ్మ పుష్కరాల పట్ల నిర్లక్ష్యత వహించారు? అంటే…

ADVERTISEMENT

‘ఏపీలో అందమైన భవనాలున్న రాజధాని లేదు… అలాగే కృష్ణమ్మ కొలువై ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన తెలుగు సినీ అగ్ర హీరోలకు ఆస్తిపాస్తులు లేవన్న సమాధానమే’ విశ్లేషకుల నుండి వెలువడుతోంది. కేవలం ఒక హీరో పుట్టినరోజు వేడుకలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా, మన తెలుగు హీరోలు పవిత్రమైన పుష్కర స్నానాలకు ఇవ్వకపోవడం కాస్త ఆలోచించదగ్గ విషయమే. మరో విశేషమేమిటంటే… ఎన్నికల సమయంలో ఆయా పార్టీల తరపున ప్రచారం చేయడానికి అమరావతికి ‘క్యూ’లు కట్టిన హీరోలకు, భవనాలు లేని అమరావతి అంటే ఏ మాత్రం నిర్లక్ష్యం ఉందో ఈ సందర్భంగా బహిర్గతమైంది.

కోట్లాది మంది ప్రజలు ‘పవిత్ర కార్యక్రమం’గా భావించే పుష్కరాలంటే అంత అనాసక్తి ప్రదర్శించిన మన దిగ్గజ హీరోలు, మరి తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ‘హరితాహారం’ అనే ఒక సాధారణ కార్యక్రమంలో… రాజకీయాలకతీతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవి నుండి ఏ పార్టీకి చెందని నిఖిల్ వరకు ఎందుకు అంత ఆసక్తిగా పాల్గొన్నారు? అంటే… దానికి సమాధానమే… ‘హైదరాబాద్ లో ఆస్తులు’ అన్న జవాబు. విశ్వనగరంలో తమ ఆస్తులను కాపాడుకోవడానికి మొక్కలను నాటినట్లుగా ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లలో పోస్టులు పెట్టి… తెలంగాణా సర్కార్ మన్ననలు పొందిన ఘనులంతా… కృష్ణా పుష్కరాలకు ఎందుకు రాలేదంటే ఏం సమాధానం చెప్తారు?

ఇదే సినీ సెలబ్రిటీలు మరో పది, పదిహేనేళ్ళ తర్వాత అమరావతిలో కూడా అత్యాధునిక భవనాలు వెలిస్తే రాబందుల మాదిరి వాలిపోరా? అమరావతిలో సినీ వేడుకలు జరుపుకోరా? నిజానికి ఏమీ లేనపుడు వచ్చి ప్రోత్సాహాన్ని అందిస్తే… దానికుండే విలువ వేరన్న నీతిసూత్రం సినీ శ్రీమంతులకు తెలియదా? నిజంగా అలా చేస్తే… ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోరా? చివరగా… ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఏం చెప్తే దానికి ‘జై’ కొట్టే మన సినీ హీరోలకు వందనాలు… అభివందనాలు..!

ADVERTISEMENT
Latest Stories