అధికారం ఉంటే అన్ని అవే వెతుక్కుంటూ కూర్చున్న దగ్గరకే నడిచివస్తాయన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి రాగానే రేవంత్ రెడ్డిని కలవడానికి ఒక్కొక్కరు గా సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. మొన్న మెగా స్టార్ చిరంజీవి వచ్చి రేవంత్ కు తన అభినందనలు తెలియచేస్తే నేడు అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ సీఎం నివాసంలో మర్యదపూర్వకంగా కలవడం జరిగింది.
అయితే నాగార్జున తన సతీమణి అమలతో కలిసి రాగా బాలకృష్ణతో పాటు ఆయన చిన్నల్లుడు భరత్ సమావేశమయ్యారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ కు అభినందనలు తెలియచేసారు. అయితే నాగార్జున గత తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ కు, ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం వైసీపీ కి సన్నిహితుడిగా ఉండడంతో రేవంత్ – నాగార్జున భేటీని ఆసక్తిగా గమనిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
గతంలో నాగార్జున నల్ల చెరువు ఎఫ్టిఎల్ స్థాయిలను ఉల్లంఘించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నారని, వెంటనే వాటిని అడ్డుకోవాలంటు రేవంత్ విమర్శలు గుప్పించారు.ఇప్ప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండడంతో నాగార్జున మర్యాద పూర్వకంగా కలిసాం అంటూ ఎంత మర్యాదగా చెప్పినా ఈ మర్యాదల వెనుక అసలైన ఆశలు వేరే ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
అలాగే నందమూరి బాలకృష్ణ రేవంత్ కలయిక మీద కూడా అనేక ఊహాగానాలు,ఆశలు నడుస్తున్నాయి. రేవంత్ టీడీపీ పార్టీని “వ్యతిరేకించి కాకుండా ఒప్పించి” కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ మారినా ఎన్నడూ టీడీపీ పార్టీ మీద కానీ, నారా,నందమూరి కుటుంబం మీద కానీ ఎటువంటి విమర్శలు చెయ్యలేదు.
ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలవడానికి సమయం దగ్గర పడడంతో జగన్ కు బాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రేవంత్ సహకారం అందిస్తారు అంటూ టీడీపీ అభిమానులు ఆశతో ఉంటే అటువంటివేమీ జరగవు అంటూ వైసీపీ తన ఆశల పల్లకిలో ఊగుతుంది.అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపిరిపోయడానికి రేవంత్ ప్రయత్నాలు మొదలుపెడతారంటూ అటు ఏపీలో కనుమరుగయిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ కోసం ఆశతో ఎదురుచుపులు చూస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ రేవంత్ భేటీతో ఎవరి ఆశలకు అనుగుణంగా రేవంత్ తన రాజకీయ అడుగులు వేస్తారనేది రానున్న కాలంలో తెలుస్తుంది.




