ట్రంప్‌ కూడా రప్పా రప్పా…. కూర్చున్న కొమ్మనే!

Donald Trump announcing tariff hikes affecting India and global trade

జగన్‌ రప్పా రప్పా నరకడం తప్పు కాదన్నట్లు మాట్లాడితే, భారత్‌పై అదనపు సుంకాలు విధించడం తప్పు కాదన్నట్లు ట్రంప్‌ మాట్లాడుతున్నారు.

ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ ఏపీకి నష్టం కలిగించేలా రాజకీయాలు చేస్తుంటే, ట్రంప్‌ అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT

ట్రంప్‌ సుంకాల వలన అమెరికన్లు నిత్యం వాడే షుగర్, బీపీ, జలుబు, జ్వరం, దగ్గు మందులతో సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ నెల 27 నుంచి మరో 25 శాతం సుంకాలు పెంచుతామని ట్రంప్‌ హెచ్చరించారు. కనుక అమెరికాలో వివిధ వస్తువుల ధరలు ఇంకా పెరుగడం ఖాయం.

అయినా సగటు అమెరికన్లు ఆగ్రహించకుండా ట్రంప్‌ విధానాలను సమర్ధిస్తే చాలా అదృష్టవంతుడే! కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే అమెరికన్లయినా ప్రభుత్వాన్ని నిలదీయక మానరు.

కనుక సుంకాల పెంపు వలన భారత్‌తో సహా ప్రపంచదేశాలకు కలుగుతున్న నష్టం కంటే, అమెరికన్లకే తక్షణ నష్టం కలుగుతోంది. దీనివలన తన ట్రంప్‌ ప్రభుత్వానికి ఎదురయ్యే తక్షణ సమస్యలే ఎక్కువ అని ట్రంప్‌ గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టక్కపోవచ్చు.

భారత్‌ ఆర్ధిక వ్యవస్థని ట్రంప్‌ చచ్చిన ఆర్ధిక వ్యవస్థ (డెడ్‌ ఎకానమీ) అన్నారు. కానీ ఎవరిది ‘డెడ్‌ ఎకానమీ’యో ట్రంప్‌ త్వరలోనే గ్రహిస్తారని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్న మాట అక్షరాల సత్యం.

పెద్దనోట్ల రద్దు, కరోనా, లాక్ డౌన్ వంటి అతిపెద్ద సమస్యలను భారత్‌ ఎదుర్కొని నిలబడింది. కానీ ఒక్క కరోనా దెబ్బకే అమెరికా ఎంతగా విలవిలలాడిందో, భారత్‌, చైనాల నుంచి మందులు, మాస్కుల కోసం ట్రంప్‌ ఎంతగా ఒత్తిడి చేశారో అందరూ చూశారు.

కనుక ట్రంప్‌ విసురుతున్న ఈ సవాళ్ళను భారత్‌ తట్టుకొని నిలబడటమే కాదు… దీనినే ఓ సవాలుగా, ఓ అవకాశంగా స్వీకరించి తప్పకుండా ప్రత్యామ్నాయాలు కనుగొనగలదు. మరింత స్వయం సంవృద్ది సాధించగలదు.

సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ‘ట్రంప్‌ బాధిత దేశాలను’ ఏకం చేసి వాటికి భారత్‌ నాయకత్వం వహించేందుకు స్వయంగా ట్రంప్‌ ఓ గొప్ప అవకాశం కల్పించారని చెప్పవచ్చు.

నిజానికి అమెరికాని భారత్‌ ఎప్పుడో అధిగమించి ఉండేది. కానీ ఈ కుల మత రాజకీయాలు, పాలకుల అవినీతి అభివృద్ధికి అడ్డుగోడలా నిలిచాయి.

సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వాలపై భారం పెంచుకుంటూ, దాని కోసం అప్పులు పెంచుకుంటూ పోవడం అభివృద్ధికి బ్రేకులు వేస్తోంది.

కోట్లాది మందికి ఉద్యోగ ఉపాది అవకాశాలను కల్పించే భారతీయ పరిశ్రమలను చైనా దెబ్బ తీస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అభివృద్ధికి గొడ్డలిపెట్టు.

ఇటువంటి అనేక సమస్యలు, అవలక్షణాలు భారత్‌ని పట్టి పీడిస్తున్నాయి. కనుక వీటన్నిటినీ అధిగమించేవరకు భారత్‌ అభివృద్ధి నత్త నడకనే సాగుతుంటుంది. అయినప్పటికీ ఇటువంటి పెను సవాళ్ళని తట్టుకునే శక్తి భారత్‌కు ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories