ఇదివరకు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన సీమ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ అభివృద్ధి చేసుకుంటూ పోయారు తప్ప మిగిలిన జిల్లాలని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది.
ఇటువంటిదే మరో ఉదాహరణ కరోనా మహమ్మారి విరుచుకుపడి లక్షల మంది చనిపోయే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రుల నిర్మాణాలు, వైద్యులు, నర్సులు, సిబ్బంది సంఖ్య పెంచడంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. తర్వాత ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే లాక్డౌన్ ప్రకటించే ముందు ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వలన లక్షలాది మంది సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు అష్ట కష్టాలు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు కూడా భారత్ మరోసారి అల్లకల్లోల్లం అయ్యింది.
ఈ ఉదాహరణలను గమనిస్తే తగినంత సమయం, అవకాశం ఉన్నప్పుడు పాలకులు సరైన ఆలోచన చేయకపోవడం వల్లనే ప్రజలు నానా కష్టాలు పడ్డారని అర్ధమవుతోంది.
ఇప్పుడు ట్రంప్ సుంకాలతో భారత్ మళ్ళీ అటువంటి పెను సమస్యలలో చిక్కుకోబోతోందని ‘డి ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ చైర్మన్ బ్రిజేష్ గోయల్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ వ్రాశారు.
అమెరికాపై అతిగా ఆధారపడటం వలననే భారత్కు ఇప్పుడీ సమస్య ఎదురవుతోందని దానిలో పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల వలన భారత్లో బట్టలు, తోలు, జౌళి, ఫార్మా, ఎలక్ట్రానిక్, వ్యవసాయ బంగారు ఆభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోతాయి లేదా గణనీయంగా తగ్గిపోతాయి. దీని వలన ఆయా రంగాలలో లక్షలాది మంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆ లేఖలో హెచ్చరించారు.
అంతే కాదు… ఇదే అవకాశంగా తక్కువ సుంకాలతో ఎగుమతులు చేస్తున్న దేశాలు అమెరికాలో భారత్ మార్కెట్ని కబ్జా చేస్తాయని అప్పుడు శాస్వితంగా అమెరికా మార్కెట్ మరిచిపోవలసి వస్తుందని బ్రిజేష్ గోయల్ హెచ్చరించారు.
ట్రంప్ సుంకాలతో భారత్కు సుమారు రూ.4 లక్షల కోట్లు నష్టంతో పాటు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని బ్రిజేష్ గోయల్ హెచ్చరించారు.
దీనికి తక్షణ పరిష్కారం అంటూ ఏమీ ఉండదు కానీ వీలైనంత వేగంగా సింగపూర్, ఇండోనేషియా, మలేసియా, యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని బ్రిజేష్ గోయల్ సూచించారు.
ట్రంప్ భారత్ ఆర్ధిక వ్యవస్థని తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా చేసి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, కనుక నిబ్బరంగా నిలబడి ప్రత్యమ్నాయ మార్గాలు ఆన్వేషించాలని బ్రిజేష్ గోయల్ సూచించారు.
ట్రంప్ మొదటి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పుడే ఆయన ఎలాంటివారో, ముఖ్యంగా భారత్ పట్ల ఏవిదంగా వ్యవహరిస్తారో ప్రధాని మోడీతో సహా సామాన్య ప్రజల వరకు అందరూ కళ్ళారా చూశారు. కానీ అప్పుడు మేల్కోలేదు. ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఇప్పుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన తర్వాతనే భారత్ హడావుడిగా బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మరో 25 శాతం పెంచిన తర్వాత పరుగులు తీయడం అంటే దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లే ఉంటుంది. కానీ తప్పదు.




