ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావలన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ భారత్తో కొత్త ఆట మొదలుపెట్టారు.
మొదట సుంకాలు విధించి దారికి తెచ్చుకోవాలనుకున్నారు. కానీ ప్రధాని మోడీ కూడా వెనక్కి తగ్గలేదు. చాలా తెలివిగా పావులు కదిపి రష్యా, చైనాలకు దగ్గరవుతున్నట్లు సంకేతాలు పంపారు.
ఇది ట్రంప్ ఊహించని పరిణామమే. కనుక మొదట అసహనం వ్యక్తం చేసినా ఆ తర్వాత మైండ్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు.
ముందుగా భారత్, రష్యాల ఆర్ధిక వ్యవస్థలని చచ్చిన ఆర్ధిక వ్యవస్థలని, అవి ఎలా పోయినా నాకు అనవసరమని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత చైనా విషవలయంలో భారత్ చిక్కుకుంటోందని శ్రేయోభిలాషిలా మాట్లాడారు.
ఇది అచ్చం ఏపీ ఎన్నికలలో టీడీపి, జనసేనల పొత్తులను చూసి జగన్ అసహనం వ్యక్తం చేసినట్లే ఉంది. తాను సింగిల్ సింహమని, దమ్ముంటే వారిద్దరూ తనను ఒంటరిగా ఎదుర్కోవాలని జగన్ సవాలు విసురుతుండేవారు. ఒకవేళ జగన్ ఉచ్చులో వారు చిక్కుకొని ఉంటే రెండు పార్టీలు నష్టపోయేవి కదా?
భారత్ని చైనా రష్యాలకు దూరం చేయడానికి ట్రంప్ కూడా సరిగ్గా ఇదేవిధంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపి, జనసేన ఏవిదంగా అప్రమత్తంగా ఉంటూ తమ పొత్తుని కాపాడుకొని విజయం సాధించాయో, ప్రధాని మోడీ కూడా అదేవిదంగా ట్రంప్ గాలానికి చిక్కకుండా అప్రమత్తంగా ఉంటూ రష్యా, చైనాలతో దోస్తీకి సై అన్నారు. తద్వారా ఆ రెండు దేశాల నుంచి కొన్ని వాణిజ్య ప్రయోజనాలు సాధించినట్లు తెలుస్తోంది.
కనుక ట్రంప్ ఇప్పుడు మాట, గొంతు రెండూ మార్చి “ప్రధాని మోడీ నా మిత్రుడు… అయనతో భేటీకి ఎదురుచూస్తున్నాను,” అంటూ మరో గాలం విసిరారు.
ఒకవేళ ప్రధాని మోడీ ఈ గాలానికి చిక్కుకొని రష్యా, చైనాలను వదిలించుకొని బయటకు వస్తే భారత్ మళ్ళీ బలహీనపడుతుంది. కనుక అప్పుడు భారత్తో మళ్ళీ ఓ ఆట ఆడుకోవచ్చని ట్రంప్ ఆశ పడుతున్నట్లున్నారు.
కానీ ‘మోడీ చాలా తెలివైన నాయకుడు’ అని ట్రంప్ స్వయంగా చెప్పారు. మరి తన గాలానికి మోడీ చిక్కుకుంటారని ట్రంప్ ఎలా ఆశపడ్డారో?




