నెల్లూరు జిల్లా వైసీపీలో ముగ్గురు సీనియర్ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించడంతో వారు ముగ్గురూ టిడిపిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. వారిని బహిష్కరించిన తర్వాత వారి స్థానంలో వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.
అందరూ ఊహించినట్లే మేకపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరి నియోజకవర్గానికి ఆయన కుటుంబానికే చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది. దీంతో జిల్లాలో రాజకీయ టిడిపి, వైసీపీల బలాబలాలు మారాయి.
వైఎస్సార్ కుటుంబంతో చిరకాలంగా అనుబందం ఉన్న తనను అత్యంత అవమానకరంగా పార్టీలో తొలగించినందుకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముగ్గురూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీని గెలుచుకొనీయమని శపధం చేస్తున్నారు. కనుక వారిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ ఉదయగిరి నుంచే టిడిపి అభ్యర్ధిగా బరిలో దిగడం ఖాయమే అని భావించవచ్చు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండో సోదరుడే మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఉదయగిరి వైసీపీలో ఏర్పడిన లోటును ఆయనతో బాగానే భర్తీ చేసుకోగలిగింది. కానీ ఒకే కుటుంబానికి చెందినవారి మద్య పోటీ అనివార్యంగా మారడంతో వారికీ ఇబ్బందే. ప్రజలకూ ఇబ్బందే.
ఇప్పుడు వారు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది కనుక వారి కుటుంబం పరువు వారే తీసుకొంటూ ప్రజలలో చులకనవుతారు. ఇదో సమస్యకాగా, మేకపాటి కుటుంబంలో దాదాపు అందరికీ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలతో చిరకాలంగా మంచి అనుబందం ఉంది.
మేకపాటి కుటుంబ సభ్యులందరూ పార్టీల నేతలుగా కంటే వారి సొంత పరపతితోనే ప్రజలలో ఎక్కువగా గుర్తింపు పొందారు. కనుక ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఎన్నికలలో పోటీ పడితే, వారిలో ఒకరిని ఎన్నుకోవడం ప్రజలకూ చాలా ఇబ్బందే. కానీ తప్పదు.



