2024 కూటమి విజయం తో అమరావతి తన అరణ్యవాసాన్ని ముగించుకుని తిరిగి రాష్ట్ర రాజధానిగా పట్టాభిషేకం జరుపుకుంది. నాటి నుంచి అమరావతి అభివృద్ధిలో ఒక్కో అడుగు చాల జాగ్రత్తగా ముందుకు వేసుకుంటూ అమరావతి పై భవిష్యత్ ఆశలను సజీవంగా నిలుపుతున్నారు సీఎం బాబు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతి ప్రాంతానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గొల్లపూడి బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనితో విజయవాడ – అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఇక ఇప్పుడు అదే తరహాలో నిర్మించిన ఉండవల్లి ‘స్టీల్ బ్రిడ్జ్’ అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో విజయవాడ – తాడేపల్లి – అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. సుమారు 13 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తి కావడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వ స్టీల్ సంకల్పం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వంతెన నిర్మాణంతో విజయవాడ, తాడేపల్లి నుంచి అమరావతి వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గే అవకాశం ఉంది. దీనితో అమరావతి వెళ్ళడానికి ఉండవల్లి కరకట్ట మార్గానికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్టే. అలాగే ఈ వంతెన నిర్మాణం తో తాడేపల్లి – ఉండవల్లి – అమరావతి ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటుగా అత్యవసర సేవలు, వ్యాపార రవాణా, ప్రజలు దైనందిన ప్రయాణాలు వేగవంతం కానున్నాయి.
రాజధాని అమరావతి అభివృద్ధికి మౌలిక వసతులు ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ మరోసారి నిరూపించింది. గతంలో వివిధ రాజకీయ కారణాలతో నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులు కూటమి రాక తో శరవేగంగా ముందుకు సాగాయి. అయితే ఇది కేవలం ఒక బ్రిడ్జ్ నిర్మాణం మాత్రమే కాదని అమరావతి అభివృద్ధి కి ఒక నమ్మకం, ఒక భరోసా అంటూ స్థానికులు కూటమి ప్రభుత్వ సంకల్పానికి సలాం కొడుతున్నారు.
ఉండవల్లి వద్ద కృష్ణా, పశ్చిమ ప్రధాన కాల్వ గుంటూరు ఛానల్ పై కొత్తగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్ తో పాటుగా దశాబ్దకాలం పాటు ఎదురుచూసిన సీడ్ యాక్సెస్ నిర్మాణం కూడా పూర్తి కావడంతో ఈ రెండు కనెక్టివిటీ రహదారులను ఆగష్టు 13 లేదా 15 న ముఖ్యమంత్రి చందర్బాబు చేతుల మీదుగా ప్రారంభం చేసే అవకాశం ఉన్నట్టు అనధికార సమాచారం.






