రియో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకాన్ని ఖాయం చేసిన బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఖరీదైన కానుక అందనుంది. బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో సత్తా చాటిన సింధు అలవోకగా విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సింధు విజయం సాధించిన వెంటనే తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని అయిన చాముండేశ్వరీనాథ్ ఖరీదైన బహుమతిని ప్రకటించారు.
భారత్ కు మరో పతకం ఖరారు చేసిన సింధుకు 60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రియో ఒలింపిక్స్ నుంచి ఈ నెల 28న సింధు హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పిన చాముండి… ఆ మరునాడే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ కారును సింధుకు అందజేయనున్నట్లు వెల్లడించారు. సెమీస్ లో మాదిరే ఫైనల్లో కూడా విజయబావుట ఎగురవేసి రావాలని ఆకాంక్షించారు.
బహుమతి విషయం ఇలా ఉంటే… ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో భారత్ కు స్వర్ణపతకం వస్తుందని గోపీచంద్ అకాడమీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫైనల్లో సింధుతో తలపడనున్న స్పెయిన్ క్రీడాకారిణి కెరలీనా మారన్ ను సింధు గతంలో ఒకసారి ఓడించిందని పేర్కొంటున్నారు. ఆమెపై ఎలా ఆడాలో సింధుకు తెలుసని, గతంలో ఆమెపై ఆడిన, ఓడించిన అనుభవం సింధుకు ఉండడంతో బంగారు పతకం సాధిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



