ఇటీవల ముద్రగడ పద్మనాభం చేసిన కుల రాజకీయాల సందర్భంలో కాపులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎందుకు నిలబడలేదు…? అసలు ఈ అంశంపై ఎందుకు నోరు మెదపలేదు..? అంటూ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు, తాజాగా ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, మరోసారి పవన్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడారు.
ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాపైన, తూర్పు కాపులను ‘బీసీ’ల్లో నుంచి తొలగించడంపైన ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం చాలా సిగ్గుచేటని విమర్శించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇటీవల పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ…. ముందు సొంత రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు పవన్ కృషి చేయాలని, ఆ తర్వాతే పక్క రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుందని అన్నారు.
అయితే ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం కేవలం మీడియా వర్గాల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీని ఉద్ధరించాక కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల సంగతి చూసుకోవచ్చని హితవు పలికిన వీహెచ్ కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని, ముందు తెలంగాణాను ఉద్ధరించిన తర్వాత ఏపీలో సంగతులు చూసుకోవచ్చని పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేస్తున్నారు.



