టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పేరిట కేవలం పాదయాత్ర మాత్రమే చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో మతకల్లోల్లలు, అల్లర్లు సృష్టించడం లేదు. కనుక వైసీపీ ప్రభుత్వం ఆయన పాదయాత్రకి అవరోదాలు కలుగకుండా రక్షణ కల్పిస్తే చాలు. కానీ పోలీసులే అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూ నారా లోకేష్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుండటం చూస్తే, యువగళం పాదయాత్ర సాగకూడదని నిలిచిపోవాలని వైసీపీ ప్రభుత్వం కోరుకొంటున్నట్లు అర్దం అవుతోంది.
నారా లోకేష్ చేతిలో నుంచి పోలీసులు మైక్ లాగేసుకొన్నప్పుడు ఆయన ఓ మాటన్నారు. “మీరు నా చేతిలో నుంచి మైక్ లాగేసుకొన్నా అందరికీ వినబడగలిగేలా మాట్లాడే శక్తి, గొంతు మా తాతగారు ఎన్టీఆర్ నాకు ఇచ్చారు. కనుక మైకు లాగేసుకొంటే మాట్లాడలేననుకోవడం అవివేకమే,” అని అన్నారు. అది నిజం కూడా! నారా లోకేష్ చేతిలో మైక్ లేనప్పటికీ జనం మద్యలో నిలబడి మాట్లాడుతుంటే అందరూ హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు.
నారా లోకేష్ తిరుపతి జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి వందలమంది పోలీసులు, వజ్ర వాహనాలని కూడా రంగంలో దింపారు. వారి హడావుడి చూస్తుంటే వారే ప్రజాలపైకి దండయాత్రకి బయలుదేరిన్నట్లుంది. అయితే ఆ హడావుడితో ప్రజలని భయబ్రాంతులని చేసి తనకి దూరంగా ఉంచేందుకేనని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు.
నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తునంప్పుడు తన వెనకే వస్తున్న వజ్ర వాహనాన్ని చూపిస్తూ నారా లోకేష్ ఓ సెల్ఫీ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “నేనంటే ఎందుకింత భయం జగన్?ఈ సెల్ఫీలో నా వెనుకున్న వాహనం చూశారా?అదేనండి వజ్ర వాహనం. మతకలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు ఉపయోగిస్తారు కదా! అదే. ప్రశాంతంగా సాగుతున్న నా పాదయాత్రకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు జగన్ రెడ్డి ఆదేశాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు,” అని ట్వీట్ చేశారు.
వందలమంది పోలీసులని, వారి వాహనాలని చూస్తున్నప్పుడు ఎవరైనా కాస్త జంకుతారు. కానీ నారా లోకేష్ జంకడం లేదు. ప్రజలు కూడా జంకడం లేదు! నారా లోకేష్ వజ్ర వాహనాన్ని చూపిస్తూ దాంతోనే సెల్ఫీలు దిగి, ముఖ్యమంత్రిని “నేనంటే నీకెందుకు ఇంత భయం జగన్?”అని ఎదురుప్రశ్నిస్తున్నారు.
దీనివలన అర్దమవుతున్నదేమిటంటే, పోలీసులతో నారా లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోలేరని. కనీసం ప్రజలని కూడా నారా లోకేష్కి దూరం చేయలేరని! కానీ ఈ అనవసరమైన హడావుడి, ఈ అత్యుత్సాహంతో ప్రజల దృష్టిలో నారా లోకేష్ని రియల్ హీరోగా చేస్తూ తామందరం ప్రజల దృష్టిలో పలుచనవుతున్నారని వైసీపీ ప్రభుత్వం గ్రహించిన్నట్లు లేదు.



