జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచే మూడు మూళ్ళ ఘట్టం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. అందుకే ఆ వేడుకకు సంబంధించిన ఏ విశేషమైనా అందరితో పంచుకోవాలని ఉంటుంది. దానికి సెలబ్రిటీ, సామాన్యులనే తేడా ఉండదు. అంతస్థులో వ్యత్యాసం ఉండొచ్చు కానీ ఫీలింగ్ ఒకటేగా. కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ద్వారా పెళ్లి పుస్తకంలో మొదటి పేజీ తెరవబోతుండగా, విచిత్రంగా ఇద్దరి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దానికి సంబంధించి ఎలాంటి ట్వీట్ కానీ అప్డేట్ కానీ లేవు.
వరుణ్ తేజ్ లావణ్యల కోసం పనిచేసే పిఆర్ హ్యాండిల్స్ తో పాటు ఫ్యాన్ అసోసియేషన్ అకౌంట్ల ద్వారా రేపు ఎంగేజ్ మెంటని అధికారికంగా ముద్ర పడింది కానీ నిజానికి కుటుంబసభ్యుల నుంచి కానీ స్వయంగా ఆ జంట నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. పనుల్లో బిజీ అనుకోవచ్చు కానీ నిమిషం లోపు పూర్తి చేయగలిగిన ట్విట్టర్ లాంఛనానికి అంత ఆలోచించాల్సిన పని లేదు.
వరుణ్ తేజ్ చివరిగా షేర్ చేసింది గాండీవధారి అర్జున రిలీజ్ డేట్ గురించి. లావణ్య నుంచి ఒరిసా యాక్సిడెంట్ కు నివాళి అర్పించిన సందేశం ఉంది. మీడియాతో సహా బయటి వాళ్ళను ఎక్కువ ఆహ్వానించకుండా చేసుకుంటున్న వేడుకే కావొచ్చు. కానీ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాక ఇక దాచి పెట్టి లాభం లేదు. పైగా అంత అవసరమూ లేదు.
ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. ఇంకా చెప్పాలంటే గర్వంగా ఒక ఫోటో పెట్టి మేము తెరమీద కాదు, నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేయొచ్చు. మరి ఎందుకు ఆలోచించారో అర్థం కావడం లేదు. పైగా ఇదేమి ట్రోలింగ్ కి ఆస్కారం ఇచ్చే టాపిక్ అసలెంతమాత్రం కాదు. రేపు ఈవెంట్ అయ్యాక ఫోటోలతో సహా అప్పుడు చేయొచ్చు. కానీ ముందైతే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుని ఉండాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మిస్టర్, అంతరిక్షంలో నటించిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలకు బాక్సాఫీస్ రిజల్ట్ కలిసి రాలేదు కానీ ఇలా రియల్ లైఫ్ బాండింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. కొణిదెల బ్రదర్స్ మగపిల్లల్లో రామ్ చరణ్ తర్వాత జరుగుతున్న పెళ్లి వరుణ్ తేజ్ దే కాబట్టి వేడుకని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తారు. అవైనా లీకుల రూపంలో కాకుండా ముందుగా చెబితే ఈ టాపిక్ అవసరమే ఉండదు.



