గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. గొడవలెందుకని మందలించానని, అంతేతప్ప బెదిరించానన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మంత్రి ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తనవాళ్లు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని స్పష్టం చేశారు.
[m9ad]
తన మాటలను కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేసి వదిలారని మాజీ మంత్రి ఆరోపించారు. తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. తనపై కేసు పెట్టే పరిస్థితి రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దూషించలేదని పేర్కొన్నారు. తాను చంద్రబాబు, అయ్యన్నపాత్రుడితో కలిసి ఏడేళ్లు పనిచేశానని, తానెలాంటి వాడినో ఆ మాత్రం తెలియదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై బురద జల్లే ముందు ఒక్కసారి ఆలోచించాలని, తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎవరినీ, ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. వసంత మాట్లాడిన ఫోన్ టేప్ లు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవ్వడమే కాకుండా, ఇందులో జగన్ పేరును కూడా లేవనెత్తడంతో, వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు, ఒకడుగు వెనక్కి వేసి, బహిరంగంగానే క్షమాపణలు చెప్పుకొచ్చారు వసంత.



