ఎస్ఎల్‌బీసీలో సాధ్యం కానిది వెలిగొండలో పూర్తయింది

Veligonda Tunnel Project Nears Completion in Andhra Pradesh

నల్గొండ జిల్లాకు గ్రావిటీ పద్దతిలో నీళ్ళు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా అడ్డుగా ఉన్న కొండలో రెండు సొరంగాలు ఏర్పాటు చేస్తోంది. కానీ పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో పూర్తికాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేసింది.

కానీ గత ఏడాది అకస్మాత్తుగా సొరంగం మధ్యభాగం కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 8 మంది ఆ శిధిలాల కింద సజీవ సమాధి అయిపోయారు. ఎంతమంది నిపుణులు, ఎన్ని వారాలు ప్రయత్నించినా సొరంగంలో నుంచి వారి మృతదేహాలు కూడా బయటకు తీయలేని పరిస్థితి. ఈ కారణంగా సొరంగం తవ్వకం పనులు నిలిచిపోయాయి. త్వరలోనే మళ్ళీ మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ADVERTISEMENT

ఏపీలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు భూగర్బ సొరంగాల తవ్వకం పూర్తయింది. ప్రస్తుతం రెండో సొరంగంలో నుంచి టన్నల్ బోరింగ్ మెషిన్ని ముక్కముక్కలుగా కత్తిరించి బయటకు తీస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నల్లమల అడవుల గుండా నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు కృష్ణాజలాలను తరలించాలనుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకూడదనే షరతు విధించింది. కనుక ప్రభుత్వం విదేశాల నుంచి రెండు టన్నల్ బోరింగ్ మెషిన్లను తెప్పించింది. ఒక్కో మెషిన్ 175 మీటర్ల పొడవు 1,000 టన్నుల బరువు ఉంటాయి.

వాటితో మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద నుంచి దట్టమైన ఆ అడవుల కింద రెండు సొరంగాలు తవ్వారు. ఒక సొరంగం వ్యాసం 7 9 మీటర్లు కాగా పొడవు 17.8 కిమీ. రెండో సొరంగం వ్యాసం 9.2 మీటర్లు కాగా పొడవు 11.8 కిమీ.

సొరంగాల తవ్వకం పనులు పూర్తయిన తర్వాత అంత భారీ టన్నల్ బోరింగ్ మెషిన్లను ముక్కలు ముక్కలుగా కత్తిరించడం, ఆ ఇనుప ముక్కలను, యంత్రాలను, మోటార్లను బయటకు తీసుకురావడం, అక్కడి నుంచి తరలించడం మరో భారీ కార్యక్రమమే.

మొదటి సొరంగంలో బోరింగ్ మెషిన్ విడిభాగాలు మొత్తం బయటకు తీసేశారు. ఇప్పుడు రెండో సోరంగంలోని విడిభాగాలు కత్తిరించి బయటకు తీస్తున్నారు.

రెండు నెలల్లో ఈ పనులు కూడా పూర్తి చేస్తే వర్షాకాలంలో కృష్ణా జలాలను ఈ సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తరలించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories