అర్జున్ రెడ్డి… ఈ ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ ను మార్చేసింది. అప్పటివరకు సినిమా అవకాశం రావడమే గొప్ప అనుకుంటే, ఇప్పుడు ఏకంగా 10 కోట్ల బడ్జెట్ తో ఏకంగా గీతా ఆర్ట్స్ సంస్థ వంటి సంస్థలో పని చేస్తుండడం చెప్పుకోదగ్గ విషయం. సాధారణంగా బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టుకుని, ఎక్కువ లాభాలు ఆర్జించడం నిర్మాతగా అల్లు అరవింద్ చేసే పని. దీనిపై చిరంజీవితో సహా సొంత కొడుకు అల్లు అర్జున్, శిరీష్ లు కూడా అల్లు అరవింద్ పై చలోక్తులు వేసిన విషయం తెలిసిందే.
మరి అలాంటి అరవింద్ ఏకంగా 10 కోట్లు పెట్టి విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తీస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పటివరకు తన తనయుడు అల్లు శిరీష్ తో కూడా ఈ రేంజ్ బడ్జెట్ లో సినిమా తీయని అరవింద్, విజయ్ కు ఖర్చు పెడుతున్నారంటే, చిత్ర కధతో పాటు, హీరోగా విజయ్ పై ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “గీతా గోవిందం” అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో పరశురామ్ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా చేసిన విషయం తెలిసిందే.



