ప్రముఖ కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సేతుపతి ఇటీవల తమిళనాడులో కరూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించినప్పుడు 40 మంది త్రొక్కిసలాటలో మృతి చెందారు. మరో 50 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఊహించినట్లే ఈ విషాద ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పార్టీల మద్య రాజకీయ చదరంగం మొదలైంది. ఈ త్రొక్కిసలాట వెనుక రాజకీయ కుట్ర జరిగిందని అనుమానిస్తున్నామని, కనుక సీబీఐ చేత విచారణ జరిపించాల్సిందిగా మద్రాస్ హైకోర్టు-మదురై బెంచిలో టీవీకే పార్టీ పిటిషన్ వేసింది.
దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం టీవీకే పార్టీ తీరుని తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తుంటే, సీబీఐ విచారణ జరిపించాలంటూ పిటిషన్ వేయడాన్ని హైకోర్టు బెంచ్ తప్పు పట్టింది. హైకోర్టుని మీ రాజకీయాలకు వాడుకోవద్దని మందలించింది.
విజయ్ ర్యాలీ నిర్వహించడం తప్పు కాదు. కానీ 10 వేల మందితో నిర్వహించాల్సిన ర్యాలీకి 30 వేలమందికి పైగా వచ్చారని ఆయనకు ముందే తెలుసు. ఇటువంటప్పుడే త్రొక్కిసలాట జరిగి ఇలాంటి విషాద ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుసు. కనుక ర్యాలీ రద్దు చేసుకొని ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కావు.
కానీ అలా చేస్తే టీవీకే పార్టీ పట్ల ప్రజలలో తప్పుడు అభిప్రాయం లేదా భావనలు కలుగుతాయని, రాజకీయ ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తారానే భయం వల్లనో విజయ్ ర్యాలీకి హాజరయ్యారు. త్రొక్కిసలాట జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోయారు.
అలాగని విజయ్ ఒక్కరినే దీనికి పూర్తి బాధ్యులని నిందించలేము. ర్యాలీకి 30 వేల మందికి పైగా జనం వచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎండలో నిలబడి ఎదురుచూపులు చూస్తున్నారని ప్రభుత్వానికి, పోలీసులకు తెలుసు. కానీ త్రొక్కిసలాట జరగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.
ర్యాలీ నిర్వాహకులు, విజయ్ అభిమానులకు కూడా ఈ పాపంలో భాగం ఉంటుంది. చట్ట ప్రకారం ఈ నేరానికి వారు బాధ్యులు కాకపోయి ఉండొచ్చు. కానీ వారికీ నైతిక బాధ్యత ఉంటుంది.
తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ చేసిన తప్పులు లేదా నిర్లక్ష్యానికి 40 మంది అమాయక ప్రజలు బలైపోయారు.
ఇది విషాదాంతం అయిన చోటు నుంచే ఈ రాజకీయ చదరంగం మొదలవడం భాదాకరమే కదా? అయినా రాజకీయాలలో పెను మార్పు తెస్తానని పదేపదే చెపుతున్న విజయ్ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ఈవిదంగా ఆశావ రాజకీయాలతో మొదలుపెట్టడం ఎవరూ హర్షించరు.




