వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో “హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు మనకు లేకున్నా ఐటీ ఎగుమతుల్లో 5 వేల కోట్లతో 34% నమోదైన వృద్ధి సిఎం జగన్ గారి సంకల్పం వల్లనే సాధ్యమైంది. విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి కంపెనీల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఐటీ రంగంలో ఈ ఏడాది కొత్తగా మరో 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి,” అని సందేశం పెట్టారు.
రాష్ట్రంలో ప్రధానంగా విశాఖ నగరంలో మాత్రమే కొన్ని ఐటి కంపెనీలు ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని హైదరాబాద్కు తరలిపోయాయి. మిగిలిన జిల్లాలలో ఐటి కంపెనీలు పెద్దగా కనబడవు. రాష్ట్రంలో ఐటి కంపెనీలన్నిటినీ వేళ్ళపై లెక్కించవచ్చంటే అతిశయోక్తి కాదు. వాటితో 34 శాతం వృద్ధి సాధించామని, రూ.5,000 కోట్ల ఎగుమతులు సాధించామని విజయసాయి రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
అసలు ఐటి రంగం అంటేనే తెలుగువారు గుర్తొస్తారు. విదేశాలలో కూడా ఈ రంగంలో ఎక్కువగా తెలుగువారే కనిపిస్తుంటారు. టిడిపి హయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఐటి రంగానికి బలమైన పునాదులు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం దాని విలువను గుర్తించి మరింతగా అభివృద్ధి చేసుకొని దేశంలోనే సంపన్న రాష్ట్రంగా ఎదిగింది.
కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు వేసిన ఐటి పునాదులను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఏపీకి అంతర్జాతీయస్థాయిలో ఓ అద్భుతమైన రాజధానిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు పూనుకొంటే ఆయనపై ద్వేషంతో దానిని కూడా పాడుబెట్టేసింది. ఇప్పుడు మనకు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలులేవని విజయసాయి రెడ్డి బాధపడటం దేనికి?పదేళ్ళ తర్వాత కూడా ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం ఎవరిది?
తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన పనులలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది పూర్తిచేసింది కానీ వేటినీ అమరావతిలా పక్కనపడేయలేదు…. పాడుబెట్టలేదు. చివరికి కాంగ్రెస్ నేతల పేర్లను కూడా మార్చలేదు. ఎక్కడా బిఆర్ఎస్ రంగులు వేయించుకోలేదు.
చకచకా అన్ని పనులు పూర్తిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని అదే విషయం ప్రజలకు గర్వంగా చెప్పుకొని ఓట్లు అడుగుతోంది. కానీ ఏపీలో వైసీపీ నేతలు సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంటికీ మేలు చేశాము కనుక ఓట్లు వేయాలని అడుగుతున్నారు.
తెలంగాణలో వారానికో ఓ అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరుగుతుంటే, ఏపీలో వారానికో ఓ సంక్షేమ పధకానికి నిధులు విడుదల చేస్తూ సిఎం జగన్ బటన్ నొక్కుతుంటారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి సంపాదించుకొని బ్రతకమని చెపుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మీకు సంక్షేమ పధకాలు ఇస్తుంటాము. వాటితో మీ జీవితాలు మారిపోతాయి. మరేమీ చేయక్కరలేదన్నట్లు మాట్లాడుతుంది. రెండు ప్రభుత్వాల ఆలోచనలలో, విధానాలలో ఎంత తేడా ఉందో తెలుసుకొనేందుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?
మన విధానాలు సరిగాలేవని సామాన్య ప్రజలకు కూడా అర్దమవుతోంది. కానీ ప్రభుత్వానికి అర్దం కాలేదనుకోగలమా? అయినా మూడు రాజధానులు, మూడు కాళ్ళ కుందేలుతో సాగిపోతూ మరో ముప్పై ఏళ్ళు ఇలాగే పాలిస్తామని కూడా గొప్పగా చెప్పుకొంటున్న వైసీపీని చూసి ఏమనుకోవాలి?



