సినీ పరిశ్రమ నుంచి జనసేనతో ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, పదేళ్ళపాటు అనేక డక్కామొక్కీలు తిని నిబ్బరంగా నిలబడినందు వల్లనే నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.
అలాగని డక్కామొక్కీలు తిన్నవారందరూ రాజకీయాలలో తప్పక రాణించగలరని గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. ఏపీలో చిరంజీవి, తమిళనాడులో కమల్ హాసన్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కానీ రాజకీయాలలో రాణించాలంటే నిలకడగా నిలబడి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే ఏదో ఓ రోజు అవకాశం లభిస్తుందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిలు నిరూపించి చూపారు.
ఇప్పుడు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా తమిళనాడు రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకోవాలని టీవీకే పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు. కానీ మొదట్లోనే అయనకు పెద్ద అగ్నిపరీక్ష ఎదురైంది. ఇటీవల కరూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించినప్పుడు త్రొక్కిసలాటలో 40 మంది చనిపోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
విజయ్ సేతుపతికి ఇది ఊహించని పెద్ద షాక్. కానీ ఆయన స్పందన మాత్రం ఊహించినట్లే ఉంది. ఈ త్రొక్కిసలాట వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందన్నట్లు మాట్లాడారు.
అధికార డీఎంకే ప్రభుత్వం కావాలంటే తనపై రాజకీయ కక్ష తీర్చుకోవాలని కానీ తన కార్యకర్తల జోలికి వెళ్ళవద్దని విజయ్ ఓ రోటీన్ ప్రకటన చేశారు. కానీ ఇలాంటి ప్రకటన రాజకీయంగా ఆయనకు, పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చలేదు. కనుక ఈ దశలోనే ఆయన తన రాజకీయ విధానాన్ని మార్చుకుంటే ఇటువంటి సమస్యలని అధిగమించి ముందుకు సాగగలరు.
తమ టీవీకే పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోదని, ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ పార్టీకి తానే ముఖ్యమంత్రి అభ్యర్దినని విజయ్ సేతుపతి చెప్పుకుంటున్నారు. కనుక తమిళనాడు రాజకీయాలలో గిరిగీసుకొని ఒంటరివాడిగా నిలబడ్డారు.
కానీ కలిసివచ్చే పార్టీల పొత్తులు కుదుర్చుకొని ముందుకు సాగడం మంచిది. లేకుంటే మరిన్ని ఎదురుదెబ్బలు తింటూ తట్టుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.
సినిమాలో ఓ పాట పెట్టి మార్పు వచ్చేసిందని చూపించవచ్చు కానీ రాజకీయాలలో అది సాధ్యం కాదు. కనుక వాస్తవ రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగానే విజయ్ ముందుకు సాగాల్సి ఉంటుంది.




