విజయసాయి రెడ్డికి బహుశా ప్రతిరోజు ఒక దఫా చంద్రబాబును విమర్శించాలని ఏదైనా కోటా ఇచ్చి ఉంటారు. ఈరోజు కోటా పూర్తి చేశారు. “గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు? అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
అయితే విజయసాయి రెడ్డి విమర్శ హాస్యాస్పదంగా ఉంది. సర్వేలు అనేవి ఎప్పుడూ ఊహాజనితమే. కొన్ని వందల మంది లేదా కొన్ని వేల మందితో మాట్లాడి కోట్ల మంది నాడిని పడతారు. కావున అవి ఖచ్చితంగా ఉండాలని ఏమీ లేదు. అందుకే ఎంత కొమ్ములు తిరిగిన సర్వే సంస్థలైనా ఎక్కడో అక్కడ పప్పులో కాలేయాల్సిందే. దీనితో ఒకే ఎన్నిక కోసం పలు సంస్థలతో సర్వేలు చేయించుకోవడం తప్పేమీ కాదు. గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? అనే ప్రశ్నలో అసలు లాజిక్ లేదు.
ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి అని విజయసాయి రెడ్డి ఉచిత సలహా ఇస్తున్నారు. బహుశా చంద్రబాబు పార్టీ మీటింగులలో వాటిని ఊటంకించి పలు సార్లు పార్టీ గెలుపు ఖాయమని చెప్పిన సంగతి ఆయనకు తెలీదేమో. అయినా టీడీపీ భవిష్యత్తు గురించి విజయసాయి రెడ్డికి బెంగ ఎందుకు? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభా ఫలితాలకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది.



