షర్మిల రాకపోతే విజయసాయి ఆ మాటనేవారా?

Vijayasai Reddy

ఇదివరకు తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారు. ఎందుకంటే బండి సంజయ్‌ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ చాలా బలపడి తమ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారింది కనుక!

ADVERTISEMENT

కానీ బండి సంజయ్‌ని విమర్శిస్తూ ఆయన స్థాయిని ఇంకా పెంచడం కంటే, ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ కేసీఆర్‌ తనను జాతీయ స్థాయికి ప్రమోట్ చేసుకొనే ప్రయత్నం చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు మోడీతో యుద్ధం చేస్తూ రాష్ట్రంలో బీజేపీని దెబ్బతీయాలనుకున్నారు.

కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలపడటం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ కేసీఆర్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన శత్రువుని మార్చేసుకుని మోడీ, బీజేపీలను పక్కన పెట్టి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీలని విమర్శించడం ప్రారంభించారు.

అంటే అధికార పార్టీలు తమకు ఎవరి వలన ప్రమాదం ఉందని భావిస్తాయో వారినే టార్గెట్ చేసుకుంటాయని స్పష్టం అవుతోంది. అలాగే శత్రువులు మార్చుకునప్పుడు, వారి శత్రువులు మిత్రులవుతారు కదా? అందుకే బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రధాని మోడీ మిత్రుడుగా కనిపిస్తున్నారనుకోవచ్చు!లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఎవరికి మిత్రులో, శత్రువులో తప్పకుండా పూర్తి స్పష్టత వస్తుంది.

ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, జగన్‌ ప్రభుత్వానికి మొదట్లో చంద్రబాబు నాయుడు, టిడిపి మాత్రమే ప్రధాన శత్రులు. తర్వాత ఆ జాబితాలో పవన్‌ కళ్యాణ్‌, జనసేన, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణలను కూడా చేర్చారు. వైఎస్ షర్మిల రాకతో ఇప్పుడు ఆమెను, కాంగ్రెస్ పార్టీని కూడా ఆ జాబితాలో చేర్చారు.

ఏపీలో వైసీపికి కాంగ్రెస్‌ శత్రువుగా మారినందున కేసీఆర్‌ ఫార్ములా ప్రకారమే వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ఒకవేళ షర్మిల ఏపీలోకి అడుగుపెట్టకపోతే విజయ సాయిరెడ్డి రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ ఊసే ఎత్తి ఉండేవారు కాదు కదా?

కనుక కాంగ్రెస్‌ మీద ఆయన ప్రతాపం దేనికంటే, ఇక్కడ ఏపీలో వైఎస్ షర్మిల మీద అక్కసుతో, అక్కడ ఢిల్లీలో ‘బీజేపీ బావల కళ్ళలో ఆనందం కోసమే.’

కానీ కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ ‘బీజేపీ బావలని’ ప్రసన్నం చేసుకోవాలని వైసీపి తరపున విజయ సాయిరెడ్డి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికే ‘బీజేపీ కృష్ణుడు’ ఏపీలో జరుగబోయే కురుక్షేత్రంలో ఎటువైపు ఉండబోతున్నాడో చూచాయగా తెలిసిపోతోంది కదా?కానీ యుద్ధంలో ఓడిపోతామని తెలిసినా యుద్ధం చేయక తప్పదు. కనుక యుద్ధం మొదలయ్యే వరకు కత్తికి ఇలా పదునుపెట్టుకుంటూనే ఉండాలి… తప్పదు!

ADVERTISEMENT
Latest Stories