విజయ సాయిరెడ్డి అప్పుడే బ్యాటింగ్ మొదలుపెట్టేశారే!

Vijayasai Reddy

“వైసీపి ఎంపీలు ఎంపీలు…. మీరందరూ ఆంద్రా కోసం ఏమి చేశారు?” అని అడిగితే బహుశః ఎవరూ సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ‘వైసీపి కోసం ఏమి చేశారు?’ అని అడిగితే తడుముకోకుండా టకటకా సమాధానం చెప్పగలరు.

వైసీపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ లేదా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా విజయ సాయిరెడ్డిని అడిగితే ఇంకా బాగా చెప్పగలరు.

ADVERTISEMENT

వైఎస్ షర్మిల సోమవారం విజయవాడలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర విభజనతో నిర్జీవంగా మారిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆమె ప్రాణం పోసేందుకు వచ్చారు. చికెన్ కూర తినాలంటే కోడి ప్రాణం తీయాల్సిందే! అలాగే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాణం పోయాలంటే దానిలో నుంచి పుట్టుకొచ్చిన వైసీపిని చంపేయక తప్పదు.

వైసీపిలో ఇమడలేక బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నవారందరూ కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూ కట్టడం ఖాయమే. అలా వెళ్ళలేని కొందరు మాత్రమే వైసీపిలో మిగిలిపోతారు. వారిలో బహుశః ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ఒకరు కావచ్చు. కానీ ఆయన కూడా వైఎస్ షర్మిలని విమర్శించే సాహసం చేయలేరు. కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కాంగ్రెస్‌ చరిత్ర పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

“2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆంధ్రప్రదేశ్‌ చాలా కీలకపాత్ర పోషించింది. అయితే ఏపీ రుణం తీర్చుకోవలసిన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ని పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ గుణపాఠం నేర్చుకున్నారు. ప్రజలు ఇప్పుడు విషసర్పానైనా నమ్ముతారు కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మబోరు,” అని విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

విజయ సాయిరెడ్డి చెప్పిన ఈ చరిత్ర పాఠాలు వైఎస్ షర్మిలకు తెలియకనే ఏపీ కాంగ్రెస్‌ని బ్రతికించగలననే నమ్మకంతో వచ్చారా?లేక ఆమె రాకతో వైసీపిలో ఏమి జరుగబోతోందో గ్రహించే విజయ సాయిరెడ్డి ఈవిదంగా బ్యాటింగ్ మొదలుపెట్టారా?

ADVERTISEMENT
Latest Stories