వైసీపి అధినేత జగన్ బటన్ నొక్కుడు సభలలో తన పాండిత్యం ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను అవహేళన చేస్తుంటే, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా వంటి కొందరు మంత్రులు, కొడాలి నాని, అనిల్ కుమార్ వంటి కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలలో తమ పాండిత్యం ప్రదర్శిస్తుంటారు. ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పాండిత్య ప్రదర్శనలకే మొగ్గుచూపుతుంటారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని వెంటబెట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ మళ్ళీ తన పాండిత్య ప్రదర్శన చేశారు. “అమ్మా పురందేశ్వరి మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించారు.
కోర్టులు కూడా ఆయన నేరం చేసిన్నట్లు అనుమానిస్తూ బెయిల్ ఇవ్వడం లేదు. కానీ నీళ్ళ కంటే రక్తం చిక్కగా ఉంటుందని నిరూపిస్తూ మీ మరిది కోసం మీరే రంగంలో దిగి ఆయన తరపున మద్యవర్తిత్వం చేసేందుకు లోకేష్ని వెంటబెట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
ఇంతకీ మీరు బీజేపీలో ఉన్నారా?టిడిపిలో ఉన్నారా?మీరు ఏ పార్టీలో ఉన్నా మీ మరిదిని కాపాడుకోవడానికే మీరు ప్రయత్నిస్తుంటారు. మీ మరిది కోసం ఏపీ బీజేపీని ‘బావ సారూప్య పార్టీ’గా మార్చేశారు కదా?” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దగ్గుబాటి పురందేశ్వరి ముసుగు వేసుకొని నారా లోకేష్ని వెంటబెట్టుకొని అమిత్ షాను కలవలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే బీజేపీ అధిష్టానానికి తెలియకుండా చేస్తున్నారనుకోవచ్చు. నారా లోకేష్తో భేటీ అయ్యేందుకు అమిత్ షా ఒప్పుకొన్నారంటేనే ఆమె పార్టీ క్రమశిక్షణను అతిక్రమించలేదని భావిస్తున్నట్లు అర్దమవుతోంది. మరి అమిత్ షాకు లేని అభ్యంతరం విజయసాయి రెడ్డికి ఎందుకు?
అక్రమస్తుల కేసులు, వివేకా హత్య కేసు కోసం జగన్, విజయసాయి రెడ్డి ఢిల్లీలో పైరవీలు చేసినప్పుడు తప్పనిపించదు. కానీ చంద్రబాబు నాయుడు కోసం నారా లోకేష్ అమిత్ షాని కలిస్తే తప్పట!
మోడీ, అమిత్ షాల అంగీకారంతోనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశామన్నట్లు వైసీపి మంత్రులు మాట్లాడుతున్నా, పురందేశ్వరి గురించి, ఏపీ బీజేపీ గురించి విజయసాయి రెడ్డి ఇంత చులకనగా మాట్లాడుతున్నా ఏపీ బీజేపీ నేతలెవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.



