వరుసగా జరుగుతున్న టీ 20 మ్యాచ్ లతో క్రికెట్ ప్రేమికులకు ఊపిరి సలపనివ్వడం లేదు. అయితే గత వారం ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్ లు ప్రేక్షకులకు ఆశించినంత వినోదాన్ని పండించడంలో విఫలమయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్ లు అంటే వీక్షకులు భారీ స్కోర్లు ఆశిస్తారు. కానీ, తొలి మ్యాచ్ నుండి మొదలైన నత్తనడక సోమవారం నాటి మ్యాచ్ వరకు సాగింది. అయితే క్రికెట్ ప్రేమికులకు, ఐపీఎల్ నిర్వాహకులకు కొత్త ఊపును తీసుకువచ్చారు విరాట్ కోహ్లి, డివిలియర్స్.
బెంగుళూరు వేదికగా వీరిద్దరు చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో ఏకంగా 227 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. ఓపెనర్ క్రిస్ గేల్ వికెట్ పడిన అనంతరం రెండో ఓవర్లో జత కట్టిన విరాట్ – డివిలియర్స్ ద్వయం హైదరాబాద్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. తొలుత చిన్న గాలి వానలా కాస్త నెమ్మదిగా ప్రారంభమైన వీరి బ్యాటింగ్ విన్యాసాలు, ఆ తర్వాత సునామీ లాగా చెలరేగిపోయాయి. మ్యాచ్ చూస్తున్నట్టు కాకుండా హైలైట్స్ చూస్తున్న అనుభూతి కలగడం ప్రేక్షకుల వంతయ్యింది.
విరాట్ కోహ్లి 51 బంతుల్లో 75 పరుగులు చేసి 16వ ఓవర్లో వెనుదిరగగా, 42 బంతుల్లో 82 పరుగులు చేసిన డివిలియర్స్ తదుపరి ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే చివర్లో సర్ఫరాజ్ ఖాన్ 10 బంతుల్లో ఏకంగా 35 పరుగులు చేయడంతో 227 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. ఇంతటి భారీ స్కోర్ ను ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు చేధించలేదు. మరి హైదరాబాద్ జట్టు ఎంత వరకు పోరాట పటిమను ప్రదర్శిస్తారో చూడాలి.
ఈ మ్యాచ్ లో హైలైట్ అంశం ఏమిటంటే… 20 ఓవర్లలో 227 పరుగులు చేసిన బెంగుళూరు జట్టు బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంత అద్భుతంగా రెహ్మాన్ బౌలింగ్ వేసి బెంగుళూరు జట్టు నియత్రించగలిగాడు. అలాగే డివిలియర్స్, వాట్సన్ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.



