సోషల్ మీడియాలో తన సరదా ట్వీట్లతో ఆకట్టుకునే వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఒక ట్వీట్ చేసి క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాడు. రేపు విరాట్ రిటైర్మెంట్… ఘనంగా వీడ్కోలు చెబుదామని ట్వీట్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు కొంత ఆందోళన చెందినా… ట్వీట్ ఆసాంతం చదివి అతనితో ఏకీభవించారు. ఇంతకీ విషయం ఏమిటంటే, భారత నావికాదళానికి 30 సంత్సరాల పాటు విశేష సేవలందించి, రిటైర్ కానున్న సందర్భంగా ఐఎన్ఎస్ విరాట్ షిప్ కు ఘనంగా వీడ్కోలిద్దామని అన్నాడు.
ఈ సందర్భంగా సెహ్వాగ్ ఏమన్నాడంటే… ‘‘రేపు విరాట్ రిటైర్ అవుతోంది. పాత ఓడలు ఎప్పుడూ చనిపోవు. వాటి స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది. భారత నావికాదళంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన ‘ఐఎన్ఎస్ విరాట్’ తన సేవలు ఉపసంహరించుకుంటుంది. ఈ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేసి దాని ఫోటోను పోస్టు చేశాడు. సెహ్వాగ్ చమత్కారపు ట్వీట్ క్రికెట్ అభిమానులను ఒకింత ఆందోళనకు గురిచేసినా, సెహ్వాగ్ సెన్స్ ఆఫ్ హ్యుమర్ కు జిందాబాద్ అంటున్నారు నెటిజన్లు.



