విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని. సిఎం, డెప్యూటీ సిఎం తదితరులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారా స్వామికి పరిస్థితి గురించి వివరమించడం తర్వాత సంతాపాలు, ఎక్స్గ్రేషియా, కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందనే స్టేట్మెంట్లు వగైరాలు రొటీన్గా జరిగిపోయాయి.
మరో 10-15 రోజుల తర్వాత అందరూ ఈ విషాద ఘటన గురించి మరిచిపోయి ఎవరి పనిలో వారు పడతారు. కానీ ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాల శోకం ఎంత నష్టపరిహారం ఇచ్చినా తీరేది కాదు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో అత్యంత అనుభవజ్ఞులైన కార్మికులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు. కనుక వారి పనితనంలో లోపం లేదా నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ ప్రాణాలే పోతాయని వారికీ తెలుసు.
1,540 డిగ్రీల ఉష్ణోగ్రతతో ద్రవ రూపంలో ఉన్న ఉక్కుని ల్యాడిల్ (పెద్ద తొట్టె) ద్వారా క్యాస్టింగ్ మెషిన్లో పోసే సమయంలో ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్య వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విశాఖ ఉక్కు కర్మాగారం 1992, ఆగస్ట్ 2వ తేదీన కమీశానింగ్ చేసి ఉత్పత్తి ప్రారంభించారు. అప్పట్లో ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించారు. ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది.
మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ఈ స్టీల్ ప్లాంట్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
కనుక స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ప్లాంట్ నిర్మించగలిగితే ఇటువంటి ప్రమాదాలు, విషాదాలు నివారించవచ్చు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనలు చేస్తున్నప్పుడు కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా?




