సమాజం ఎటుపోతోంది.? అసలు సమాజంలో ఒక వ్యక్తి ప్రాణానికి విలువుందా.? ఒక మనిషి ఆవేశమో, అతి ప్రేమో, అత్యాశాయో మరో వ్యక్తి ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా హరిస్తున్న ఘటనలు చూస్తున్నపుడు, వింటున్నప్పుడు మానవత్వం ఉన్న మనుషులలో ఇటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.
భార్య మీద అనుమానంతో భర్త, భర్త మీద ప్రేమ లేక భార్య, అక్రమ సంబంధాల మోజులో ఒకరు, డబ్బాశతో మరొకరు, కామంతో ఒకరు, కట్టలు తెంచుకున్న ఆవేశంతో మారొకరు ఇతరుల ప్రాణాలు తీస్తున్న చేదు వార్తలను ఇలా నిత్యం ఇదొక మూల న్యూస్ పేపర్స్ లో కనిపిస్తూనే ఉంటుంది, మీడియాలో వినిపిస్తూనే వస్తుంది.
తాజాగా విశాఖలో ఇటువంటి దారుణం మరొకటి సభ్య సమాజాన్ని ఆలోచనలో పడేసింది. విశాఖ ఎల్.వి నగర్ లోని నేవి టెక్నిషియన్ రవీంద్ర అనే 35 ఏళ్ళ వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లగా తనకు అంతకు ముందే పరిచయం ఉన్న 25 ఏళ్ళ మౌనిక అనే మహిళలను తన ఫ్లాట్ కి పిలిపించుకున్నాడు.
అయితే అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో రవీంద్ర ఆవేశానికి లోనై మౌనిక మీద దాడి చేసి ఆమెను ముక్కలుగా నరికి చంపేశాడు. ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నిందితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన ఘోరాన్ని చెప్పి వారి ఎదుట లొంగిపోయాడు.
అయితే రవీంద్ర ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలికి వెళ్లిన పోలీస్ అధికారులకు మౌనిక శరీర భాగాలు రవీంద్ర చెప్పినట్టుగా ఫ్రిడ్జ్ లో లభించగా మౌనిక తల మాత్రం అక్కడ లేదు. దీనితో అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ధారపాలెం వద్ద మౌనిక తలా లభ్యమయినట్టు సమాచారం.
అయితే మౌనిక తనను డబ్బులు డిమాండ్ చేయడంతోనే తానూ ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టు చెపుతున్న నిందితుడు రవీంద్ర ఆమె హత్యకు ముందుగానే ప్లాన్ చేసినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి. ఆమెను హత్య చేసే ప్రణాళికలో భాగంగానే ముందుగానే ఆన్ లైన్ లో అందుకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
సీన్ రిక్రియేషన్ లో భాగంగా రవీంద్రను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకురాగా అక్కడ బాధితురాలి తల్లితండ్రులు రవీంద్ర పై దాడికి పాల్పడ్డారు. దీనితో అధికారులు వారిని వారించి మౌనిక హత్యకు న్యాయం చేస్తామంటూ మౌనిక తల్లితండ్రులకు సర్ది చెప్పారు.
అయితే ఒక వ్యక్తి ఆవేశానికి మరో వ్యక్తి ప్రాణం బలికావడం, అది కూడా అత్యంత దారుణంగా చంపడం నిజంగా సమాజంలో మనిషి ప్రాణానికి ఉన్న విలువను సూచిస్తుంది. రవీంద్ర ఆరోపిస్తున్నట్టు మౌనిక నిజంగా డబ్బులు డిమాండ్ చేస్తే అందుకు రవీంద్ర చేసిన పని ఆమోదయోగ్యమవుతుందా.?
ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు రవీంద్ర ముందు ఎన్నో దారులున్నా రవీంద్ర ఇంత కిరాతకంగా ఒక మనిషిని ముక్కలుగా కోసి చంపడం ఎంత వరకు సమంజసం.? అసలు వీరికి ఈ ఘాతుకాలు చేయడానికి అంత ధైర్యం ఎలా వస్తుంది.?
చట్టాలలో ఉన్న లొసుగులే వీరి ధైర్యానికి పెట్టుబడిగా మారుతుందా.? ఇటువంటి వారికి న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తే కానీ మరొకరికి ఈ ఆలోచనలు రాకుండా, మౌనిక మాదిరి మరొకరు బలికాకుండా ఉంటారనేది సామాన్య ప్రజానీకం నుండి వినిపిస్తున్న డిమాండ్లు.






