తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో తమదే గెలుపు, ఈ సారి అధికారం కమలానిదే అంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఒక్కొక్కరుగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తమ ప్రత్యర్థి పార్టీ అయినా కాంగ్రెస్ గూటికి చేరడంతో నాయకులను కాపాడుకోలేక కేంద్ర నాయకత్వానికి సమాధానం చెప్పలేక తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి మరి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. అలాగే మరికొందరు నాయకులు కూడా కమలాన్ని వదిలి తమకు నచ్చిన పార్టీలో చేరుతున్నారు. జనసేన పార్టీతో పొత్తు విషయం ఎటూతేలక చివరి నిమిషంలో పార్టీ పెద్దలు తమకు హ్యాండ్ ఇస్తే ఇక తమ రాజకీయ భవిష్యత్ కు దారులు మూసుకుపోతాయనే భయంతోనో లేక ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారాలకు విలువనిచ్చో మొత్తానికి ఒక్కొక్కరుగా కాషాయం విప్పి ఖద్దర్ ధరిస్తున్నారు.
తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన వివేక్ స్వామి బీజేపీ మానిఫెస్టో అధ్యక్షుడిగా కొనసాగుతున్న తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇలా పార్టీలో ముఖ్యనేతలుగా చెప్పుకునే వారు ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేయాలంటూ, జనసేన పొత్తు విషయం తేల్చాల్సిన సమయం వచ్చిందంటూ తమ అధిష్టానానికి మొరపెట్టుకోవడం తప్ప చేసేదేమి లేదంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.
రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ మార్పుతోనే బీజేపీ అధిష్టానం తప్పటడుగు వేసిందంటూ రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.సినీ నటి వియజయశాంతి కూడా బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉందని ఆమె కూడా త్వరలో పార్టీ కండువా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.దానికి తోడు విజయశాంతి కూడా తానూ ఎప్పుడు పదవుల కోసం ఆశపడలేదని, తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనితో ఈ ప్రచారానికి ఇంకాస్త బలం పెరిగింది.
కనీసం ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే ఇక మిగిలిన ఈటెల వంటి వారు కూడా పక్క పార్టీల వైపు చూసే అవకాశం లేకపోలేదు. ఇలా బీజేపీ నుండే ఎక్కువమంది నేతలు అధికార బిఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ సారి తెలంగాణలో అధికార మార్పు తప్పదా అన్న సందేహాలు బలపడుతున్నాయి.




