ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వారి మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించని రోజు లేదు. తన ప్రత్యర్ధులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నప్పుడు ఆయన కడిగిన ముత్యంలా ఉండాలని ప్రజలు ఆశించడం తప్పుకాదు. కానీ వారు ముగ్గురినీ రాజకీయంగా దెబ్బ తీయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని అందరికీ తెలుసు.
టిడిపి, జనసేనలు చేస్తే కుట్రలు, కుతంత్రాలు. అదే… తాము చేస్తే అవి రాజకీయ వ్యూహాలు అని అందమైన ముసుగు వేస్తుంటారు. అటువంటి మరో కుట్రలో భాగమే రాంగోపాల్ వర్మ చేత తీయించిన వ్యూహం సినిమా కూడా.
దానిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు కుట్రలు, కుతంత్రాలు చేసే దుష్టులు, ప్రజలను దోచుకోవాలనుకొనే దుర్మార్గులన్నట్లు చూపబోతున్నట్లు రాంగోపాల్ వర్మ మొహమాట పడకుండా ముందే చెప్పేశారు.
ఆ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లో కూడా అదే చూపారు. ఆ సినిమాలో అచ్చం వారిన పోలిన నటీనటులను ఎంపిక చేయడం బహుశః రాంగోపాల్ వర్మకే చెల్లునేమో? వారు ముగ్గురే కాదు… కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, చిరంజీవి ఇంకా పలువురు సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు కూడా ఈ కుట్రలో భాగమే అన్నట్లు చూపారు.
తద్వారా వారందరూ దుష్టులు, దుర్మార్గులు అని ప్రజలను నమ్మించగలిగితే రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికలలో టిడిపి, జనసేనలను దెబ్బతీయవచ్చని భావించిన్నట్లున్నారు. దీనికి వైసీపి ‘వ్యూహం’ అని పేరు పెట్టుకొన్నా ఇది కూడా ఓ రాజకీయ కుట్రే అని అర్దమవుతోంది.
కానీ ఈ చవుకబారు వ్యూహం కూడా బెడిసికొట్టింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్పై గురువారం మధ్యాహ్నం నుంచి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు రాత్రి పొద్దుపోయేవరకు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈరోజు విడుదల కావలసిన ‘వ్యూహం’ సినిమాని జనవరి 11వరకు విడుదల చేయరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్షేమ పధకాల ప్రచారం కోసం లక్షల కోట్లు, వాటి ప్రచారం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తూ, చట్టబద్దత లేని వాలంటీర్ల వేల కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపి ప్రభుత్వం, టిడిపి, జనసేనలను దెబ్బ తీయడానికి కూడా కోట్లు ఖర్చు చేసి ఇటువంటి సినిమాలు తీస్తుండటం విస్మయం కలిగిస్తుంది. వైసీపి మాటలకు, చేతలకు ఎక్కడ పొంతన ఉండదని చెప్పేందుకు ఈ వ్యూహం సినిమాయే తాజా ఉదాహరణ కాదా?




