కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి ఇంటి పోరు చుట్టుకుంది. అటు తనయుడు కేటీఆర్ ఇటు కుమార్తె కవిత ఇద్దరి మధ్య పార్టీ పై ఆధిపత్య హక్కు కోసం అంతర్గత యుద్ధం జరుగుతుంది.
బిఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ను తప్ప ఎవ్వరిని ఉహించలేను, నాకు అధినేత ఎప్పటికి కేసీఆరే, ఏనాటికైనా నేను ముఖ్యమంత్రిని అయ్యి తీరుతా అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తొందరపాటు చర్య గా భావించాలా.?
లేక పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి కూడా పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రకటించకపోవడం అనేది కేసీఆర్ చేసిన ఆలస్యంగా పరిగణించాలా.? ఈ రెండు ప్రశ్నల మధ్యే బిఆర్ఎస్ రాజకీయం నలిగిపోతుంది.
పార్టీ పై హక్కు వదులుకునేది లేదు అంటూనే గులాబీ కండువాను ఇప్పటికే దూరం చేసుకున్నారు కవిత. ఇక కవిత జాగృతి రాజకీయాలతో కేసీఆర్ కారు నుండి కవితను కిందకు దింపేందుకు సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు కేటీఆర్.
అయితే ఇప్పటికే పార్టీ ఓటమి కేసీఆర్ ను మానసికంగా కుంగదీసి ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తే, ఇప్పుడు కొడుకు – కూతురు మధ్య మొదలైన రాజకీయ వైరాలు కేసీఆర్ ను శారీరకంగా కూడా దెబ్బకొట్టి ఆసుపత్రి పాలు చేస్తున్నాయా అంటూ తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.
కేటీఆర్, కవిత ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆరే అంటూ చెప్పుకుంటున్నప్పటికీ బిఆర్ఎస్ 3.0 అధికారంలోకి వస్తే ఆ తరువాత పార్టీలో జరిగే పరిణామాలను కవిత ముందుగానే ఉహించి ఇప్పటి నుంచే తొందరపడుతున్నారా.?
లేక కేసీఆర్ ఇప్పటికైనా తన రాజకీయ వారసుడిగా, పార్టీ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ ను ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారా.? ఒక పక్క హరీష్ గండం, మరో పక్క కవిత రగడ రెండు కలిపి కేసీఆర్ నిర్ణయాన్ని ఈ నాటికి వెనక్కి నెడుతున్నాయా.?
పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీ భవిష్యత్ ప్రణాళికల మీద ముందాలోచన చేయని కేసీఆర్ ఇప్పటి పరిస్థితులకు బాధ్యత వహిస్తారా.? కేసీఆర్ నోరు విప్పితే కానీ బిఆర్ఎస్ చుట్టూ అల్లుకున్న ఇంటి పోరు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు.
ఏదిఏమైనా కవిత తొందరపాటు, కేసీఆర్ ఆలస్యం రెండు కలిసి కల్వకుంట్ల బ్రాండ్ కు ఒక మాయని మచ్చని తేవడంతో పాటుగా బిఆర్ఎస్ పార్టీకి తీరని వివాదాన్ని తీసుకొచ్చింది.






