అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా చంద్రబాబుకి మంచి గుర్తింపు ఉంది. ఏడు పదుల వయస్సులోనూ యువనాయకుల కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం పై సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సైతం సిద్ధమయ్యే చంద్రబాబు ఒక్కసారిగా ప్రజలకు దూరమయ్యారు.
గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో స్కిల్ స్కాం జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వం బాబు పై కేసు పెట్టి నంద్యాల పర్యటనలో ఉన్నా బాబుని అరెస్టు చేయడం, ఇక ఆ తరువాత వైసీపీ నేతల ప్రయత్నాలు, టీడీపీ నేతల పోరాటాలు అంతా తెలిసిన రామాయణమే అనుకోండి. అయితే సెప్టెంబర్ 9 న నంద్యాలలో సిఐడి అధికారులు బాబుని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత నుంచి చంద్రబాబు రాజకీయ జీవితం మరో మలుపు తిరిగిందనే చెప్పాలి.
అయితే బాబుకి స్కిల్ కేసులో రెగ్యులర్ బైలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన పై కేసుల మీద కేసులు వేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళీ బాబుని అరెస్టు చేసి ప్రజా జీవితానికి దూరం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం బాబు చుట్టూ అల్లిన కేసులనే పద్మ వ్యూహాన్ని ఛేదించుకుని ప్రజల మధ్యకు రావడానికి టీడీపీ పార్టీ కూడా న్యాయపోరాటాన్నే నమ్ముకుంది.
న్యాయపోరాటాలతో కేసుల నుండి ఊరట పొందిన తరువాతనే చంద్రబాబు పూర్తిగా ప్రజల మధ్యకు వచ్చే ఆలోచనలతో ఉన్నారని సమాచారం. ఈ పంచాయితీలు ముగిసేలోపు ఆరోగ్యంగా కూడా కొంచెం నిలదొక్కుకునే అవకాశం కూడా బాబుకి దొరుకుతుంది. బాబు పై ఇన్ని నిరాధారమైన కేసులు వేస్తూ ఆయనను ప్రజల మధ్యకు రానివ్వకుండా ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎందుకు ఇంతలా ఆరాటపడుతుందో? అనేది బహుశా టీడీపీ పార్టీ కంటే వైసీపీ శ్రేణులకే ఎక్కువ తెలుసనుకుంటా.
2019 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వంలో జగన్ యాత్రలకు చంద్రబాబు అడ్డుకట్ట వేయకపోవడానికి వచ్చిన ఫలితమేమిటో ఇప్పుడు జగన్ అనుభవిస్తున్నాడు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నేతల ప్రజా యాత్రలను కట్టడి చేయకపోతే ప్రజలలో ఇంతో అంతో ఉన్నప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీలకు ఓటు బ్యాంకునుపెంచుతుందని 2019 ఎన్నికల ఫలితాలతో జగన్ నిర్దారించుకున్నారు.
గతంలో చంద్రబాబు చేసిన ఈ తప్పు వల్లనే ప్రస్తుతం బాబుకి, టీడీపీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనేది టీడీపీ అభ్యర్థులే కాదు వైసీపీ నేతలు సైతం అంగీకరించే వాస్తవం.అయితే న్యూట్రల్ పబ్లిక్ కూడా ఇదే వాదనను బలపరుస్తున్నారు. “లాభం చేసినోడికన్నా లాభపడినోడికే దాని ఫలితం విలువ ఎక్కువగా తెలుస్తుంది”. అందుకే జగన్ ఇప్పుడు బాబుని రానున్న 5 నెలల పాటు ఏదోక రకంగా కేసులు పెట్టి, భయపెట్టి ప్రజాక్షేత్రానికి దూరం చేయడమే తన అంతిమ లక్ష్యం నెరవేరడానికి ఉన్న ఏకైక మార్గంగా ఎంచుకున్నారు. దాన్నే అమలుచేస్తున్నారు కూడా.
జగన్ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు తనదైన శైలిలో చెక్ పెట్టి బాబు తిరిగి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నేతలను ప్రభుత్వం పై యుద్దానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని తమ రాజకీయ ఎత్తుగడలను సిద్ధం చేసుకుని పొత్తులో ఉన్న జనసేన పార్టీని కలుపుకుని తిరిగి వైసీపీ ప్రభుత్వం పై పోరాటానికి బాబు రంగం సిద్ధం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అదేగాన నిజమైయితే డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు తెరపడి ఇక ఆంధ్రా రాజకీయాలు తెర మీద ప్రదర్శనకు సిద్దమవుతాయన్న మాట.






