చాలాకాలం పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తిగా సంచలన దర్శకుడు వర్మ నిలిచారు. అయితే అది కూడా తనకు బోర్ కొట్టేసిందంటూ పవన్ విడిచిపెట్టిన వర్మ, ఇటీవల కాలంలో పెద్దగా పవన్ జోలికి రావట్లేదు. దీంతో వర్మ గోల పోయిందని భావించిన తరుణంలో… పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ‘బిగ్ బాస్’ ద్వారా ఫేం అయిన మహేష్ కత్తి తగులుకుంటున్నారు. సినీ విశ్లేషకుడు అయిన మహేష్ కత్తి, రాజకీయ, సామాజిక పరమైన అంశాలపై స్పందిస్తూ… ముఖ్యంగా ‘జనసేన’ అధినేతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
పవన్ మాట్లాడిన ప్రతి అంశంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ… ఎదురుదాడి చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే… “కాటమరాయుడు” సినిమా రివ్యూ విషయంలో పవన్ ఫ్యాన్స్ నన్ను తగులుకున్నారు, కానీ ‘జనసేన’ అధినేత చేస్తున్న ప్రకటనలతో ప్రస్తుతం నేను వాళ్ళను తగులుకున్నాను అనే సమాధానమే కత్తి మహేష్ నుండి లభిస్తోంది. అయితే నిజంగా సమాజంపై మహేష్ కత్తికి అంత ప్రేమ ఉంటే, కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడినే నిలదీయడం దేనికి? వైఎస్ జగన్ ను ఎందుకు ప్రశ్నించరు? అలాగే కేసీఆర్, చంద్రబాబులపై ఎందుకు స్పందించరు? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాను చేసేది పబ్లిసిటీ కోసం కాదు అని చెప్పే మహేష్ కంటికి ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కరే కనపడుతున్నారా? ఒక సినీ నటుడిగా ఉండకుండా, తన వంతు సాయంగా ఏదో చేయాలని పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ ను నిలదీయడం ఎంతవరకు సబబు? ఒకవేళ అది సమంజసమే అయితే పవన్ సహచర నాయకులైన జగన్ అండ్ కోలపై ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం వెనుక ఆంతర్యం… ఎవరికి ఎరుక..? దీనిని పబ్లిసిటీ పిచ్చి కాకపోతే ఏమంటారు మహేష్ వర్యులు..? ఇది కాదంటే… వెనుక ఉన్న ఆ “జగన్నాటక” సూత్రధారి ఎవరో..?



