అద్దాల మేడలో కూర్చొని ఎవరిపైనా రాళ్ళు విసరకూడదని తెలిసినా సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పదేపదే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇక ఫ్లెక్సీ బ్యానర్లతో మరో యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లు రాంగోపాల్ వర్మ చేత తమకు అనుకూలంగా, వారికి వ్యతిరేకంగా సినిమాలు కూడా తీయించుకొంటున్నారు.
ఎదుటవారికోసం గోతులు తవ్వితే ఏదోరోజు దానిలో ఆ తవ్వినవారే పడే అవకాశం కూడా ఉంటుంది. వైసీపీ విషయంలో అదే జరిగింది. రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం జగన్ కంచుకోట కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే ప్లకార్డు ప్రదర్శించడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు.
దానిలో ఓ వైపు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో, మరోవైపు గొడ్డలితో దారుణంగా హత్యచేయబడిన ఫోటో, వాటిపైన సిఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించారు. కడప జిల్లాలో ఇలా నడిరోడ్డుపై వేలాదిమంది మద్య నిలబడి, ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే ప్లకార్డు ప్రదర్శించడానికి చాలా గుండె నిబ్బరం ఉండాలి. సీబీఐ అధికారులే కడపలో భయపడుతుంటే నారా లోకేష్ నిర్భయంగా ప్లకార్డు ప్రదర్శించడంతో స్థానిక ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
నారా లోకేష్ ఈవిదంగా చేయడానికి చాలా బలమైన కారణమే ఉంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ, ఐప్యాక్ కలిసి నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని ఎంత దారుణంగా దెబ్బతీశారో అందరికీ తెలుసు. అదే మరొకరైతే ఆ అవమానం, ర్యాగింగ్ తట్టుకోలేక కోడెల శివప్రసాదరావులాగ ఆత్మహత్య చేసుకొని ఉండేవారు.
కానీ నారా లోకేష్ వాటినే పాఠాలుగా చేసుకొని తన లోపాలను సవరించుకొన్నారు. కానీ ఈ విషయం తెలియని వైసీపీ నేతలు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎప్పటిలాగే ఆడుకోబోయారు. కానీ కేవలం మొదటి రెండు వారాలలోనే నారా లోకేష్ తాను వారి ‘ఆటవస్తువు’ను కానని, అవమానాలు, అవహేళనల నిప్పుల కొలిమిలో కాలి పదును తేరిన కత్తినని వారి తాట తీసి మరీ తెలియజేస్తున్నారు.
రాయలసీమ జిల్లాలలో టిడిపికి వ్యతిరేకత ఉందని, కనుక నారా లోకేష్ ప్రజల నుంచి వ్యతిరేకత భరించలేక మద్యలోనే పాదయాత్ర మానుకొంటాడని వైసీపీ నేతలు భావిస్తే, ఆయన ఎక్కడికక్కడ ప్రజలలో కలిసిపోతున్నారు. ప్రజలు కూడా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. నారా లోకేష్ కూడా ఏదో కబుర్లు చెప్పి సాగిపోకుండా ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి భాగోతాలను బయటపట్టి నిలదీస్తున్నారు.
దీంతో నారా లోకేష్ తమ నియోజకవర్గంలో అడుగుపెడుతున్నారంటేనే వైసీపీ నేతలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే నారా లోకేష్ కడపలో మాత్రం రిస్క్ తీసుకోరని, ఎక్కువ హడావుడి చేయకుండా వీలైనంత త్వరగా ముందుకు సాగిపోతారనుకొంటే, కడప నడిబొడ్డున నిలబడి జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు!
తన అవమానాలన్నిటికీ ప్రతీకారం తీర్చుకొంటున్నట్లు ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం నడిబొడ్డున నిలబడి ‘హూ కిల్డ్ బాబాయ్?’అని నిలదీశారు. వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పకనే చెప్పారు.
సిఎం జగన్మోహన్ రెడ్డికి తిరుగేలేని కడప జిల్లాలోనే నారా లోకేష్ ప్రశ్నించడంతో మౌనం వీడి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించారు. లేకుంటే నారా లోకేష్ సవాలును ఎదుర్కొలేకపోయారనే భావన జిల్లా ప్రజలలో కలిగితే వైసీపీ నష్టపోవడం ఖాయం. కడప కంచుకోటలోనే నారా లోకేష్ తొడకొట్టి సవాలు విసరడం వైసీపీలో ఎవరూ ఊహించి ఉండరు. కనుక రేపటి నుంచి మళ్ళీ మంత్రులందరికీ నోటి నిండా పనే.
.@naralokesh gets into a heated argument with Police trying to stop ‘Who Killed Babai?‘ campaign#YuvaGalamLokesh #YuvaGalamPadayatra pic.twitter.com/goBkURs8zv
— MIRCHI9 (@M9News) June 1, 2023



