ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి విషయంలోనే కాదు… ఉద్యోగుల విషయంలోనూ చాలా తేడా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్రగతి నివేధన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఉద్యోగుల గురించి ఏమి చెప్పరో వింటే ఇది అర్దమవుతుంది.
“కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అధికారులు, ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా చాలా కీలకపాత్ర పోషించారు. వారి సహాయసహకారాలు లేనిదే నేడు తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెంది ఉండేది కాదు. కనుక ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైన అధికారులు, ప్రభుత్వోద్యోగులు, కార్మికులు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను,” అని సిఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వోద్యోగులను వారి ముఖ్యమంత్రి ఇంతగా గౌరవిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తూ వారిని కట్టడి చేయాలని ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగ సంఘాన్ని రద్దు చేస్తామని నోటీసులు పంపడం, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖ నిబందనలను ఉల్లంఘించారనే సాకుతో ఆయనను అరెస్ట్ చేయబోవడం అటువంటివే కదా? ఆయన అరెస్టుకు భయపడి నాలుగు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే, ఆయనేదో కరడుగట్టిన ఉగ్రవాది అన్నట్లు పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలలోనైనా ‘ఛలో విజయవాడ’ అని తలిస్తే మర్నాడు తెల్లవారుజామునే వారి ఇళ్ళ ముందు, పాఠశాలలు, కార్యాలయాల ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు. వారిని గృహనిర్బందం చేయడమో లేదా పోలీస్ స్టేషన్లలో నిర్బందించడమో పరిపాటి.
పాఠశాలల వద్ద పోలీసులను కాపలాపెట్టడం వంటి ఎన్నడూ కనీవినీ ఎరుగని అవమానాలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని ఒత్తిళ్ళ మద్య పనిచేస్తున్నా ప్రభుత్వం సకాలంలో వారికి జీతాలు చెల్లించకలేకపోతోంది. ఎన్నోసార్లు ఉపాధ్యాయులు రోడ్లపై ఆందోళనలు చేయడం అందరూ చూశారు కదా?
టిడిపి, జనసేనల వలన వైసీపీ రాజకీయంగా నష్టపోతుంది కనుక వాటిపై రాజకీయ కక్షసాధింపులని అర్దం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం కోసమే పనిచేసే ప్రభుత్వోద్యోగులమీద, సమాజంలో మార్పు కోసం పనిచేసే ఉపాధ్యాయుల మీద ఎందుకీ కక్ష?దాని వలన చివరికి నష్టపోయేది ఎవరు?



