మమత నుంచి కేసీఆర్ వరకు.. ఓటమి తర్వాత అదే కథ!

Regional Parties Crisis

ఒకానొక సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా నిలిచాయి. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే వాటి మద్దతు తప్పనిసరి అయ్యేది. నేటికీ అదే పరిస్థితి ఉన్నప్పటికీ, బీజేపీ ధాటికి తట్టుకోలేక దేశంలో ప్రాంతీయ పార్టీలు క్రమంగా నిర్వీర్యం అవుతున్నాయి.

ఇందుకు తాజా ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఎదురైన పరిస్థితి గురించి చెప్పుకోవచ్చు. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను ఆమె శాసించారు. ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. ఒకానొక సమయంలో ప్రధానమంత్రి పదవిని సైతం ఆశించారు.

ADVERTISEMENT

ఆ స్థాయికి ఎదిగిన ఆమె, ఇటీవల పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోగానే తృణమూల్ కాంగ్రెస్‌లో 59 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తిరుగుబాటు చేశారు.

వారు సోమవారం కోల్‌కత్తాలో సమావేశమై ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇకపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదేనని వారు ప్రకటించుకున్నారు.

తెలంగాణ రాజకీయాలను రెండు దశాబ్దాల పాటు శాసించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.

ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, ఇటీవల ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో, అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి విజయ్‌కు మద్దతు ఇచ్చారు.

మహారాష్ట్రలో శివసేనతో సహా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఇలాగే విచ్ఛిన్నం అవుతున్నాయి.

ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఈ విధంగా వరుసగా విచ్ఛిన్నం అవుతుండటంతో పలువురు బీజేపీని నిందిస్తున్నారు.

కానీ ఆయా పార్టీలలో వారసత్వ కుటుంబ రాజకీయాలు, రెండో శ్రేణి నాయకత్వం బలహీనపడటం, పదవి, అధికార కాంక్ష, ప్రలోభాలు, బెదిరింపులు, అవినీతి కేసులు వంటి అనేక ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా విచ్ఛిన్నమవుతుంటే కాంగ్రెస్ అధిష్ఠానం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతోంది. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అపజయం తప్పకపోవచ్చు.

ప్రజాస్వామ్యం కంటే పదవి, అధికారమే ముఖ్యమనుకోవడం వలననే ఇటువంటి అవాంఛనీయ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కానీ ఒకసారి ఈ విధంగా దెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం అవసరం, గొప్పదనాన్ని గుర్తించి దానిని కాపాడుకోవాలని ప్రజలను కోరుతున్నాయి. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని బాధపడి ఏం ప్రయోజనం?

ADVERTISEMENT
Latest Stories