రాష్ట్రానికి ఉపయోగపడని ఎంపీలు మనకెందుకు?

BJP Leader raghunandan Rao

గత ఎన్నికలలో వైసీపి ఎంపీ అభ్యర్ధులను గెలిపిస్తే, కేంద్రం మెడలువంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలను అమలు చేయిస్తానని జగన్మోహన్‌ రెడ్డి పదేపదే చెప్పారు. ప్రజలు ఆయన మాటలు నమ్మి 23 మంది ఎంపీలను గెలిపించారు. తర్వాత కధ అందరికీ తెలిసిందే.

ఒకరు ‘డర్టీ పిక్చర్’తో పాపులర్ కాగా, మరొకరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్నారు. మిగిలిన ఎంపీలు కూడా భూకబ్జాలు, ఇసుక మాఫియాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో చాలా బిజీగా ఉన్నారు. ఎవరికీ ఆంధ్రప్రదేశ్‌ సమస్యలు, ప్రయోజనాల గురించి ఆలోచించే సమయం, ఆసక్తి రెండూ లేవనే చెప్పాలి.

ADVERTISEMENT

ఈ నేపధ్యంలో తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. “కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే ప్రధాని నరేంద్రమోడీకి మొహం చాటేశారు. కనుక బిఆర్ఎస్‌ ఎంపీలు కూడా తెలంగాణకు నిరుపయోగంగా మారిపోయారు. రాష్ట్రానికి ఉపయోగపడని ఎంపీలను ఎన్నుకుని ఏం ప్రయోజనం?కనుక లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులకు ఓట్లు వేస్తే అవన్నీ వృధా అయిపోతాయి….” అంటూ బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకోవడం అవసమని చెప్పారు.

కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీతో గొడవ పెట్టుకున్నందున బిఆర్ఎస్‌ ఎంపీల వలన తెలంగాణకు ప్రయోజనం కలగలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చాలా సఖ్యతగా, విధేయంగా ఉంటారు కదా?పైగా కేసీఆర్‌కు కేవలం 9 మంది ఎంపీలు ఉంటే, జగన్మోహన్‌ రెడ్డికి 23 మంది ఎంపీలు ఉన్నారు కదా?అయినా వారి వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేకుండా పోయింది! ఎందువల్ల?

కనుక రఘునందన్ రావు చెప్పిన్నట్లు రాష్ట్రానికి ఉపయోగపడని ఎంపీలను ఎన్నుకోవడం కంటే పార్లమెంటులో ఏపీ సమస్యలు, అవసరాలు, విభజన హామీల గురించి ధైర్యంగా మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీసి ప్రశ్నించే గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు వంటివారిని ప్రజలు లోక్‌సభకు పంపగలిగితే మంచిది కదా?

ADVERTISEMENT
Latest Stories