ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం మొత్తం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో మొదలైన వివాదం చిలికి చిలికి రాజకీయ రచ్చ గా మారుతుంది.
మొన్న నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ అందుకు జనసేన నుంచి వచ్చిన రిప్లై తో ఇదొక ముగిసిన అధ్యాయం అంటూ మొదలైన కథ తెలంగాణ జర్నలిస్టుల వివాదాస్పద వ్యాఖ్యలతో మరో మలుపు తిరిగింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు వారి కామెంట్స్ కి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ల ప్రకటనలు ఈ మంటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇక జూన్ – 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జనసేన నవ నిర్మాణ సభ అంటూ పవన్ ప్రకటించడంతో అసలు పవన్ హైద్రాబాద్ లో ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటూ తెలంగాణ వాదం పేరుతో పవన్ చుట్టూ రాజకీయ రచ్చ మొదలయ్యింది.
ఇప్పుడు ఆ రచ్చకు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగినప్పుడు 11 రోజుల పాటు అన్నం మానేసాను అంటూ ప్రకటించిన పవన్, కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి దిష్టి తగిలింది అంటూ వ్యాఖ్యానించిన పవన్ ఇప్పుడొచ్చి తెలంగాణలో పార్టీ నవ నిర్మాణ సభ అంటూ ఏర్పాట్లు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తూనే,
ముందుగా పవన్ తన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని, సభ నిర్వహణకు ముందే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డబ్బులిస్తే ఏ నటన అంటే ఆ నటన చేస్తాడని, ఏ డ్రెస్ వేసుకో మంటే ఆ డ్రెస్ వేసుకుంటాడని, ఇక ఇప్పుడు తెలంగాణకొచ్చి మోడీ అద్దేశాలతో బీజేపీ డ్రెస్ వేసుకుని రాజకీయం మొదలు పెట్టారంటూ పొన్నం పవన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.
అలాగే ఇటు తెలంగాణ అంజన్న దేవాలయమైన కొండగట్టు కు పవన్ టీటీడీ తరుపున అందించిన సాయాన్ని కూడా రాజకీయం చేస్తూ, దాని పై కూడా విమర్శిలకు దిగారు మంత్రి పొన్నం. మొన్న తుందుర్తి ఎమ్మెల్యే, ఆ తరువాత మెడ్చర్ల ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి ఇలా కాంగ్రెస్ నాయకులందరు ఒకరి తరువాత ఒకరు అన్నట్టుగా పవన్ ను ఎందుకింతలా టార్గెట్ చేస్తున్నారు.?
అయితే అసలు ఇన్నాళ్లు తెలంగాణలో సైలెంట్ గా ఉన్న ప్రాంతీయవాదం ఒక్కసారిగా పవన్ చుట్టూ ఒక పద్మవ్యూహంలా ఎందుకు చుట్టూ ముడుతుంది.? నాగేశ్వరరావు ఆవేశపడేలా, టి.కాంగ్రెస్ నాయకులు ఆలోచన కోల్పోయేలా చేసిన ఆ విమర్శల వెనుక జరుగుతున్న తెరవెనుక రాజకీయం ఏంటి.?
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటన, ఆ పై తెలంగాణలో పవన్, బాబు లతో మోడీ జరిపిన సమావేశాలే ఈ వివాదానికి పునాదులు వేసాయా.? తెలంగాణలో బీజేపీ రాజకీయ బలోపేతానికి మోడీ పవన్, బాబు ల సాయం కోరారా.? ఆ కారణమే తెలంగాణలో ఒక్కసారిగా ప్రాంతీయవాదాన్ని తెరమీదకు తెచ్చిందా.?
ఈ రకమైన రాజకీయంతో ఇక రానున్న రోజులలో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుందా.? మోడీ టి. బీజేపీ నేతల కంటే కూడా పవన్, బాబు ల పై నమ్మకాన్ని పెంచుకున్నారా.? నాటి మోడీ పరామర్శల పర్యటనల వెనుక, సరదా భేటీల వెనుక ఉన్న అంతర్గత రాజకీయం ఇప్పుడు ఈ విధంగా రాజకీయ విశ్లేషకుల రూపంలో, అధికార పార్టీ ఎమ్మెల్యే ల మాటలతో బహిర్గతం అవుతుందా.?




