గన్నవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లోనే గడుపుతున్నారు.
టీడీపీ కార్యాలయంప దాడి కేసులో నుంచి తప్పించుకునేందుకు, టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకుపోయి, బెదిరించి భయపెట్టి అతని చేత ఆ కేసు వాపసు తీసుకునేలా చేశారు.
ఆ కిడ్నాప్ కేసులోనే వంశీ జైలు పాలయ్యారు. ఆ కేసులో ఎస్సీఎస్టీ కోర్టు నేడు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కానీ పోలీసులు ఆయనపై మరికొన్ని కేసులు నమోదు చేసినందున వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. విజయవాడలో కోర్టుకి హాజరుపరిచి మళ్ళీ జైలుకి తరలించారు.
జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకు వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై తన అనుచరుల చేత దాడి చేయిస్తే ఆయనతో పాటు వారు కూడా జైల్లో చిక్కుకుపోయారు.
ఎవరైనా వైసీపీ నేత అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వారిని పరామర్శించడం ఆనవాయితీ. కానీ వల్లభనేని వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఆనవాయితీని పాటించడం లేదు.
మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు పరామర్శించి, “వల్లభనేని వంశీ అందగాడు కనుకనే చంద్రబాబు నాయుడు ఓర్వలేక అరెస్ట్ చేయించారు తప్పితే వంశీ ఎటువంటి తప్పు చేయలేదని” జగన్ సర్టిఫై చేశారు. మూడు నెలలుగా జైల్లో ఉండటంతో వల్లభనేని వంశీ అందం తరిగిపోయింది. అలాగని పోలీసులు ఆయనని విడిచిపెట్టడం లేదు.
కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ లభించినా వేరే కేసులు జైలులోనే గడపాల్సి వస్తోంది కనుక జగన్ రెండో సారి వల్లభనేని వంశీని పరామర్శించక పోవడం బాధాకరమే.
ఈ కేసుల లెక్క కోసం కాకపోయినా మూడు నెలలుగా జైల్లో ఉన్న కారణంగా వల్లభనేని వంశీ శారీరిరకంగా, మానసికంగా చాలా క్రుంగిపోయినట్లే కనిపిస్తున్నారు. కనుక ఆయనకు జగన్ ఓదార్పు చాలా అవసరం.
కానీ జగన్ మాత్రం ఒక్కసారి పరామర్శిస్తే, ఓదార్చితే వందసార్లు చేసినట్లే అని అనుకోమంటే వంశీ హార్ట్ అవరూ?
కనుక కేసుల లెక్కలు పక్కన పెట్టి జగన్ ఓసారి విజయవాడ జైలుకి వెళ్ళి వంశీని ఓదార్చి వస్తే బాగుంటుంది కదా మావయ్యా?




